Prabhas Radheshyam: రాధేశ్యామ్‌లో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి?

11 Sep, 2021 14:18 IST|Sakshi

బాహుబలితో ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన ఆ స్థాయిలోనే సినిమాలు చేస్తున్నాడు. ఆయన హీరోగా ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజా హెగ్డే హీరోయిన్‌. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రభాస్‌కి విలన్‌గా బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తిని రంగంలోకి దించే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇదే నిజమైతే వెంకటేశ్‌, పవన్‌ కల్యాణ్‌ ‘గోపాల గోపాల’ తర్వాత  మిథున్‌కు ఇది మరో తెలుగు సినిమా అవుతుంది. ఈ సినిమాలో కృష్ణంరాజు కూడా ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారని భోగట్టా.

కాగా ఇటలీలో తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా 1970లో సాగే పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ వేసిన సెట్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ  ఏడాది చివరికి మూవీని విడుదల చేసేలా టీం ప్లాన్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం ఓం రౌత్‌ డెరెక్షన్‌లో ‘ఆదిపురుష్‌’, కేజీఎఫ్‌ డెరక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌’, టాలీవుడ్‌ డెరెక్టర్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

మరిన్ని వార్తలు