Mohan Babu: ఎన్నో రకాలుగా మోసపోయాను, వారెవరు నాకు ఉపయోగపడలేదు..

20 Mar, 2022 10:40 IST|Sakshi

విలక్షణ నటుడు మోహన్‌ బాబు బర్త్‌డే వేడుకలు శనివారం తిరుపతిలో ఘనంగా జరిగాయి. మార్చి 19న మోహన్‌ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఆయన 70వ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జీఆర్‌ గ్రూప్స్‌ అధినేత అమరనాథ రెడ్డి, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు పండిట్‌ రవి శంకర్‌ ముఖ్య అతిథిలుఉ హజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్‌ బాబు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల అధినేతగా ఎదగడం వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయన్నారు.

చదవండి: రెండున్నర నెలల వరకు గర్భవతిని అనే విషయం తెలియదు: నటి

స్టేజ్‌ మీద ఏం మాట్లాడాలో తెలియడం లేదు గురువు గారు అంటూ దాసరి నారాయణను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు మోహన్‌ బాబు ‘జీవితమంత కష్టాలమమైంది. దాదాపు 7 సంవత్సారాలు తిండిలేక, రెండు జతల బట్టలతో.. కారు షెడ్‌లో ఉంటూ.. ఎదో సాధించాలని పొట్ట చేత పట్టుకుని తిరుపతి నుంచి మద్రాసుకు వెళ్లాను. దేవుని ఆశీస్సులతో దాసరి గారు మోహన్‌ బాబుగా నన్ను పరిచయం చేశారు. ప్రతి క్షణం నా జీవితం ముల్ల బాటగా ఉండేది’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. అలాగే ‘నేను ఎంతో మంది ఉపయోగపడ్డాను. కానీ వారెవరు కూడా నాకు ఉపయోగపడలేదు. ఎన్నో రకాలుగా మోసపోయాను. ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా. జీవితం అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోంది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: ఫీజులో రాయితీ.. సినీ కార్మికుల పిల్లలకు ఆఫర్‌: మోహన్‌ బాబు

ఇక 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనక ఎంతో శ్రమ ఉందని మోహన్‌బాబు అన్నారు. ఇక పండిట్ రవిశంకర్ మాట్లాడుతూ.. మోహన్‌బాబు త్వరలో ప్రారంభించబోయే యాక్టింగ్ స్కూలుకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మోహన్‌బాబు ముక్కుసూటి మనిషని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. దీని వల్ల ఆయన ఎన్నో కోల్పోయారని అయితే, మరికొన్నింటిని మాత్రం ఆయన సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న, నరేష్, అలీ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు