Son Of India: చిరు పరిచయం, మోహన్‌బాబు డైలాగులతో రచ్చ!

4 Jun, 2021 14:09 IST|Sakshi

చాలా కాలం తర్వాత కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా '‘సన్‌ ఆఫ్‌ ఇండియా'. ఇది దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమని టైటిల్‌ చూస్తేనే అర్థమవుతోంది. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య రిలీజ్‌ చేశాడు.

"మన అంచనాలకు అందని ఓ వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్నా అంటూ మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ ప్రారంభమైంది. అతడి రూటే సెపరేటు.. తను ఎప్పుడు? ఎక్కడ ఉంటాడో? ఎప్పుడు? ఏ వేషంలో ఉంటాడో? ఆ దేవుడికే ఎరుక. తన బ్రెయిన్‌లో న్యూరాన్స్‌ ఎప్పుడు, ఎలాంటి ఆలోచనలను పుట్టిస్తుందో ఏ బ్రెయిన్‌ స్పెషలిస్టూ చెప్పలేడు" అని మోహన్‌ బాబు గురించి క్లారిటీ ఇచ్చేశాడు చిరు.

టీజర్‌లో ఎన్నో గెటప్పుల్లో కనిపించిన ఈ విలక్షణ నటుడు మరోసారి తన డైలాగులకు పదును పెట్టినట్లు కనిపిస్తోంది. 'నేను చీకటిలో ఉండే వెలుతురిని.. వెలుతురులో ఉండే చీకటిని', 'నేను కసక్‌ అంటే మీరందరూ ఫసక్‌' అని చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ పతాకం‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నాడు. 

చదవండి: ఎన్‌.టి.ఆర్‌ తర్వాత డైలాగులను బాగా పలుకుతారన్న పేరు ఆ ఒక్కరికే ఉంది

మరిన్ని వార్తలు