Mohan Babu: పగవాడికి కూడా నా కష్టాలు రాకూడదు: మోహన్ బాబు

18 Mar, 2023 22:18 IST|Sakshi

వెండితెరపై విలక్షణ నటుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. తన నటనతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ గా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మెప్పించిన ఏకైక నటుడు ఆయనే. తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు స్వయంకృషితోనే ఎదిగారు. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 

సీనియర్ ఎన్టీఆర్‌తో ‘మేజర్ చంద్రకాంత్’ మూవీ మోహన్ బాబు కెరీర్‌లోనే ఎవర్ గ్రీన్. ఆ తర్వాత పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న లాంటి సినిమాలు మోహన్ బాబు స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేతగా మోహన్ బాబు విద్యారంగంలోనూ సక్సెస్ అయ్యారు.

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో 1952 మార్చి 19న మోహన్ బాబు జన్మించాడు. ఆదివారం ఆయన 71 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు మోహన్ బాబు హాజరయ్యారు. తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదని మోహన్ బాబు తెలిపారు. 

ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ..' పగవాడికి కూడా నాలా కష్టాలు రాకూడదు. సినీ కెరీర్‌లో ఎదురైన ఇబ్బందుల వల్ల  నా ఇల్లు కూడా అమ్ముకున్నా. కానీ ఏ ఒక్కరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. సన్నాఫ్ ఇండియా, జిన్నా చిత్రాలు ఫెయిల్యూర్‌గా నిలిచాయి..' ‍అని అన్నారు.  

మరిన్ని వార్తలు