Mohanlal: సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న మోహన్‌లాల్‌

28 Apr, 2021 10:29 IST|Sakshi

నటుడిగా మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ ఇప్పుడు అతడు నటనలో కాకుండా మరో పనిలో లీనమయ్యాడు. లాక్‌డౌన్‌లో తన ఇంటి వద్ద సేంద్రీయ పంటలు పండించాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇందులో ఆయన మొక్కలకు నీళ్లు పడుతూ, వాటి సంరక్షణ చూస్తూ రైతుగా మారిపోయాడు.

సోరకాయలు, మిరపకాయలు, టమాటలు, వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు.. ఇలా చాలా రకాల కూరగాయలతో పాటు ఆకుకూరలను పండించినట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ అతడే స్వహస్తాలతో తెంపుతుండటం విశేషం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తన టీమ్‌తో కలిసి ఈ వీడియోను టీజర్‌ మాదిరిగా కట్‌ చేయించి రిలీజ్‌ చేశాడు మోహన్‌ లాల్‌. ఈ సందర్భంగా అందరూ బాల్కనీల్లో లేదా టెర్రస్‌ల మీద నచ్చిన కూరగాయలను పండించుకోవచ్చని సూచించాడు.

A post shared by Mohanlal (@mohanlal)

ఇదిలా వుంటే ఆయన నటించిన 'దృశ్యం 2' ఈ మధ్యే ఓటీటీలో విడుదలై అద్భుత స్పందన రాబట్టుకుంది. ఈ క్రమంలో 'ఆరాట్టు' అనే మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'మరక్కర్‌: లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ' చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్‌ మోహన్‌లాల్‌ (మోహన్‌లాల్‌ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. 16వ శతాబ్దానికి చెందిన నేవల్‌ కమాండర్‌ కుంజాలి మరక్కర్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

చదవండి: మోహన్‌లాల్‌ కూతురిని ఆశీర్వదించిన బిగ్‌ బీ

మరిన్ని వార్తలు