సాక్షి, న్యూఢిల్లీ: 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవార్డులను ఒక సంవత్సరం పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మోహన్లాల్ నటించిన మరక్కార్ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది.
అసలు విషయమేంటంటే.. ఈ చిత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు. విడుదల కాకముందే అవార్డును ఎలా ప్రకటించారని అందరు నివ్వెరపోయారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 26న విడుదలకావాల్సింది. లాక్ డౌన్ కారణంగా చిత్రం విడుదలకు నోచుకోలేదు. గత ఏడాదే సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది. ఈ ఏడాది మే 19న మూవీని చిత్ర బృందం రిలీజ్ చేయనుంది.
కాగా, జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు 4 అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో వినోదం అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్గా మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ ఎంపికైంది. తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నాని నటించిన ‘జెర్సీ’ (దర్శకత్వం గౌతమ్ తిన్ననూరి) అవార్డు గెలిచింది. ‘మహర్షి’ చిత్రానికి నృత్యాలు సమకూర్చిన రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్గా, ‘జెర్సీ’కి ఎడిటింగ్ చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్గా జాతీయ అవార్డులకు ఎంపికయ్యారు.
(చదవండి: మోహన్ లాల్ కసరత్తులు.. నెటిజన్లు ఫిదా)