‘కోయిలమ్మ’నటుడు అమర్‌‌‌పై కేసు

29 Jan, 2021 08:21 IST|Sakshi

గచ్చిబౌలి: బోటిక్‌ పెట్టిన స్నేహితురాళ్లు నష్టం రావడంతో ఘర్షణ పడి ఇరు వర్గాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా కోయిలమ్మ సీరియల్‌ కథానాయకుడు అమర్‌పై కేసు నమోదైంది. రాయదుర్గం సీఐ ఎస్‌.రవీందర్‌ వివరాల ప్రకారం.. స్నేహితులైన శ్రీవిద్య, రష్మీదీప్‌ మణికొండలోని సిద్ధిసాయి కాలనీలో షాపు అద్దెకు తీసుకొని బోటిక్‌ పెట్టారు. నష్టం రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోగా శ్రీవిద్య బోటిక్‌ను నిర్వహిస్తోంది. రూ. 5 వేల విలువ చేసే కుట్టు మెషిన్‌ బోటిక్‌లో వదిలి వేశానని స్నేహితులైన స్వాతి, తేజ, బుల్లితెర నటుడు అమర్, హర్ష బుధవారం రాత్రి 8 గంటలకు మణికొండకు వెళ్లి కుట్టు మెషిన్‌ ఇవ్వాలని అడిగారు.

ఇంటి వద్ద ఉందని చెప్పడంతో శ్రీవిద్య స్నేహితురాళ్లు అపర్ణ, లక్ష్మీలతో పాటు రష్మీకి మద్దతుగా వచ్చిన వారందరు స్ప్రింట్‌ రివర్‌ షేడ్‌ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షన నెలకొంది. అసభ్యంగా దూషించి దాడికి పాల్పడ్డారని శ్రీవిద్య రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమను కూడా దూషించి దాడి చేశారని స్వాతి ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై  కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు