ముంబై: బాలీవుడ్ సింగర్, నటి మొనాలి ఠాకూర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి శక్తి ఠాకూర్ భౌతికంగా దూరమైనా, ఎల్లప్పుడూ తన చుట్టూ ఉండి ప్రతికూలతలు అధిగమించే మానసిక స్థైర్యాన్ని అందిస్తారంటూ ఉద్వేగానికి గురయ్యారు. రాజులా ఈ లోకాన్ని వీడి వెళ్లారని, తన తండ్రి లాంటి పరిశుద్ధ ఆత్మలను దేవుడు తన దగ్గరికి చేర్చుకుంటాడంటూ ఎమోషనల్ అయ్యారు. కాగా బెంగాళీ సినిమాలతో సినీ ఇండస్ట్రీలో అడుగపెట్టిన శక్తి ఠాకూర్, ఆ తర్వాత బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చి నటుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 73 ఏళ్ల వయస్సులో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆదివారం కన్నుమూశారు. ఆ సమయంలో మొనాలి ఠాకూర్ స్విట్జర్లాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంతిమ గడియల్లో తండ్రికి దగ్గరగా లేనని, సమయం వచ్చినపుడు ఆయనను తప్పక కలుసుకుంటానంటూ ఇన్స్టాలో భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. (చదవండి: పెళ్లైన విషయం దాచి.. నాతో డేటింగ్ చేసింది)
లవ్ యూ సో మచ్ బాబా..
‘‘మా నాన్న.. నా సర్వస్వం.. నా ఉనికికి మూలమైన వ్యక్తి, నా తొలి విమర్శకుడు, చీర్ లీడర్, నా గురువు.. నా తలపై చేయి వేసి దీవించే దైవదూత.. అమర్ బాబా.. నిన్న మమ్మల్ని విడిచి వెళ్లారు.. దయా గుణం, నిరాండబరత్వానికి ప్రతీకగా నిలిచిన మీలాంటి వ్యక్తిని నేనింతవరకు చూడలేదు.. అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం లేకపోవచ్చు.. కానీ తనదైన అనేక రంగాల్లో ఆయన మాస్టర్... ఆయన వ్యక్తిత్వం జీవితాంతం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు.. ధైర్యాన్ని ఇచ్చారు.. నా గుండె ముక్కలైంది నాన్నా.. కానీ మీ కూతురు ఎప్పుడూ కుంగిపోదు.. మీలాగే ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతుంది. మీ కూతురినైనందుకు ఎంతో గర్వంగా ఉంది.. అలాగే మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది... ప్రేమను పంచిన మీ అడుగుజాడల్లో నడుస్తుంది. మీకు సదా కృతజ్ఞురాలినై ఉంటాను నాన్నా.. ఐ లవ్ యూ సో మచ్ బాబా.. మళ్లీ చెబుతున్నా.. చోటు మీలాగే స్ట్రాంగ్గా ఉంటుంది బాబా!!.. నాన్న జాగ్రత్తగా ఉండండి.. మిమ్మల్ని కలుస్తాను’’అంటూ మొనాలి ఠాకూర్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు.