విద్యా బాలన్‌ని డిన్నర్‌కి పిలవలేదు : మంత్రి

29 Nov, 2020 19:20 IST|Sakshi

విద్యా బాలన్‌ని తాను డిన్నర్‌కి పిలవలేదని, వాళ్లే తనను ఆహ్వానిస్తే వీలుకాక పోలేదని మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా స్పష్టం చేశారు. తన వాళ్ల షూటింగ్‌ ఆగిపోయిందనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. ‘షేర్నీ’ షూటింగ్‌ నిమిత్తం మధ్యప్రదేశ్‌కు వచ్చిన బాలివుడ్‌ నటి విద్యా బాలన్‌ని మంత్రి విజయ్‌ షా డిన్నర్‌కు ఆహ్వానిస్తే ఆమె నిరాకరించారని, దీంతో షూటింగ్‌కి అనుమతి ఇవ్వకుండా చిత్ర యూనిట్‌ని మంత్రి ఇబ్బందులు పెట్టారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి విజయ్‌ ఈ వార్తలపై వివరణ ఇచ్చారు.

మంత్రి విజయ్‌ షా

‘షేర్నీ’ చిత్ర యూనిట్‌ బాలాఘాట్‌లో షూటింగ్‌ కోసం అనుమతి తీసుకున్నారు. నన్ను డిన్నర్‌కు రమ్మని ఆహ్వానించారు. ఇప్పట్లో సాధ్యం కాదని, మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పాను. దీంతో డిన్నర్‌ ఏర్పాట్లు ఆగిపోయాయి. అంతే కానీ సినిమా షూటింగ్‌ మాత్రం ఆగిపోలేదు. అడవిశాఖ అధికారులు చిత్ర యూనిట్‌ వాహనాలకు అనుమతి నిరాకరించారనేది అవాస్తవం’ అని మంత్రి విజయ్‌ పేర్కొన్నారు. 

అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వంలో విద్యా బాలన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షేర్నీ’. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథాంశం ఇది. ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్‌ వల్ల ఆగిపోయింది. ఇటీవలే మధ్యప్రదేశ్‌ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ ను తిరిగి ప్రారంభించారు. చిత్రీకరణ అంతా దాదాపు అడవుల్లోనే జరగనుందట.

మరిన్ని వార్తలు