Mrunal Thakur: సౌత్‌లో వరుస అవకాశాలు.. హైదరాబాద్‌కు హీరోయిన్‌ షిఫ్ట్‌!

19 Mar, 2023 11:28 IST|Sakshi

ఫస్ట్‌ సినిమాకే సక్సెస్‌ సాధించడమనేది అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందచందాలు, దానికి తోడు అభినయం ఉన్నా సరే కొందరికి అది అందని ద్రాక్షగానే ఉంటుంది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత కానీ వారికి విజయం దక్కదు. ఈ జాబితాలో మృణాల్‌ ఠాకూర్‌ ముందువరుసలో ఉంటుంది. బుల్లితెరపై తన కెరీర్‌ మొదలు పెట్టిన మృణాల్‌ సీతారామంతో టాప్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

ఎన్నో ఏళ్లుగా రాని గుర్తింపు ఒక్క సినిమాతో రావడంతో తనకీ అవకాశం ఇచ్చిన టాలీవుడ్‌కు ఎంతో కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్‌ తన రెండో ఇల్లు అని చెప్తూ ఉండే మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా నగరంలో ఓ ఇల్లు కొనుగోలు చేసిందట! సౌత్‌లో వరుస అవకాశాలు వస్తుండటంతో ఇక్కడికే మకాం మార్చాలనుకుంటోందట ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తను ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు ఫిల్మీదునియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

మృణాల్‌ సినీ ప్రయాణం సాగిందిలా..
ముజే కుచ్‌ కేతి.. యే ఖామోశ్యాన్‌ సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించింది మృణాల్‌. తర్వాత కుంకుమ భాగ్య ధారావాహికలో మెరిసింది. ఈ సీరియల్‌ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అనంతరం లవ్‌ సోనియా(2018) చిత్రంతో వెండితెరపై కనిపించింది. సూపర్‌ 30, బాట్లా హౌస్‌ వంటి చిత్రాలు చేసినా ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో మృణాల్‌కు టాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది.

సీతారామం సినిమాతో తన దశ తిరిగింది. ఈ మూవీలో నేచురల్‌ యాక్టింగ్‌తో అదరగొట్టిన ఆమె ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నాని కెరీర్‌లో ఓ కొత్త సినిమాలో కథానాయికగా యాక్ట్‌ చేస్తోంది. ఈ చిత్రంతో శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చెరుకూరి వెంకటమోహన్‌, డా.విజయేందర్‌ రెడ్డి, మూర్తి కలగర ఈ సినిమా నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు