ఆలియా, సంజయ్‌ లీలా భన్సాలీకి కోర్టు సమన్లు

25 Mar, 2021 15:39 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌, దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ‘గంగూభాయ్‌ కతియావాడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ముంబై రెడ్‌ లైట్‌ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. గంగూబాయ్‌ కతియావాడి టైటిల్‌ రోల్‌లో ఆలియాభట్‌ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని ఆమె నలుగురు దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

సినిమా కథాంశం చనిపోయిన తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన కోర్టు..ఆలియా భట్‌, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైఅనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్‌ జైదీలకు సమన్లు జారీ చేసింది. దీనిపై మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది.

మాఫియా క్వీన్‌గా పేరు పొందిన ముంబయ్‌లోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించిన గంగూబాయ్‌ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముంబయ్‌ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్‌ వేశారు.గంగూబాయ్‌ పాత్రను ఆలియా చేస్తున్నారు. అయితే  ఈనెల ప్రారంభంలో దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ఆయనకు కోవిడ్‌ నెగిటివ్‌ వచ్చినందున మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. జూలై 30న ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నారు.

చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..
పాట కోసం బ్రేక్‌

మరిన్ని వార్తలు