26/11 విషాదం.. ‘మీ జ్ఞాపకాలే నా బలం’

26 Nov, 2020 19:51 IST|Sakshi

ఉగ్రదాడిలో చనిపోయిన సోదరిని తలచుకుని నటుడి భావోద్వేగం

26/11 వింటేనే చాలు ఇప్పటికి అనేక మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఆవేదనతో గొంతు పూడుకుపోతుంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజున ముష్కరులు ముంబైలోని తాజ్‌ హోటల్‌ని అడ్డగా చేసుకుని రాక్షసకాండ సాగించారు. నాటి మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. నాడు మరణించిన వారిలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆశిష్‌ చౌదరి సోదరి, ఆమె భర్త కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని తలుచుకుంటూ ఆశిష్‌ చౌదరి భావోద్వేగానికి లోనయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చిన్ననాటి ఫోటోలను, జ్ఞాపకాలని షేర్‌ చేసుకున్నారు. ‘మీరు లేకుండా నా జీవితంలో ఒక్క రోజు కూడా పూర్తవ్వదు. జిజు, మోనా మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాను’ అన్నారు. ఫోటోలతో పాటు.. ‘ఈ రోజు నేను ఎలా ఉ‍న్నానో చూడండి.. ఈ రోజు వరకు మీ జ్ఞాపకాలే నన్ను బలంగా నిలబడేలా చేశాయి. మీరున్నప్పుడు ప్రతి రోజు సంతోషంగా మనం ఆడుతూ పాడుతూ ఎలా గడిపామే ఇప్పుడు కూడా అలానే జీవిస్తున్నారును. ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో మీరు నా పక్కనే ఉన్నారనే ఆశతోనే నేను శ్వాసించగల్గుతున్నాను. మీ జ్ఞాపకాలే నా బలం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు ఆశిష్‌ చౌదరి.  (ఇప్పటికైనా న్యాయం చేయండి: భారత్‌)

A post shared by Ashish Chowdhry (@ashishchowdhryofficial)

పాకిస్తాన్‌ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్,  నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ముష్కరులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన మారణకాండ సాగింది. 

మరిన్ని వార్తలు