Murali Mohan: చైసామ్‌ మా అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు, గొడవపడేవారు కాదు

20 Jul, 2022 14:51 IST|Sakshi

నాగచైతన్య- సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. తరచూ వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తోంది. ఇదిలా ఉంటే వీరి విడాకుల గురించి తాజాగా సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ స్పందించాడు. ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అలాంటి చూడముచ్చని జంట ఎలా విడిపోయిందో అర్థం కావడం లేదన్నాడు.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'మాకు హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఆ అపార్ట్‌మెంట్స్‌ పైన నా కుటుంబం కోసం ప్రత్యేకంగా ఇళ్లు కట్టుకున్నాం. ఒకటి నా కోసం, రెండోది నా కొడుకు కోసం, మరోటి నా తమ్ముడు కిషోర్‌ కోసం. 14వ అంతస్థులో స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌ ఇలా అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. నాగచైతన్య ఓసారి మా ఇల్లు చూసి మాకు కావాలండీ అని అడిగితే ఇది అమ్మడానికి కాదు మా ఫ్యామిలీ కోసం కట్టుకున్నామని చెప్పాను. దీంతో నాగార్జున అడిగాడు. అప్పటికే నేను నాగేశ్వరరావుగారికి పెద్ద అభిమానిని. వారి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆయన అడిగేసరికి కాదనలేకపోయాను.

కానీ మాలో ఎవరిది ఇచ్చేయాలా? అని ఆలోచనలో పడినప్పుడు నా కొడుకు తనది ఇచ్చేయమన్నాడు. పెళ్లికి ముందే చైతూ ఒక్కడే ఉండేవాడు, పెళ్లయ్యాక సామ్‌తో ఉండేవాడు. అయితే వాళ్లు ఒక ఇల్లు కొనుకున్నారు. అది బాగు చేయించుకుని అందులోకి మారడానికి ఒక ఏడాది పడుతుందని చై చెప్పాడు. అంతలోనే విడాకులు తీసుకున్నారు. అసలు వాళ్లు విడిపోతున్నారన్న విషయం నాకన్నా ముందు పనిమనిషులకే తెలిసింది. కానీ వాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కలిసి వాకింగ్‌, వర్కవుట్స్‌ చేసేవారు. ఎప్పుడూ గొడవపడలేదు. వాళ్లు విడిపోతున్నారన్న విషయం ముందే తెలిసి ఉంటే నాగార్జునతో మాట్లాడి కలపడానికి ప్రయత్నించేవాడిని. కానీ అప్పటికే వాళ్లు నిర్ణయం తీసుకున్నారు' అని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్‌.

చదవండి: అతనికి నేను ఎలాంటి డబ్బు ఇచ్చేది లేదు: ఆర్జీవీ
ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

మరిన్ని వార్తలు