సంగీత దర్శకుడు చంద్రశేఖర్‌ కన్నుమూత

13 May, 2021 00:53 IST|Sakshi

కరోనా మహమ్మారి మరణాలు ఆగడం లేదు. తాజాగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆల్‌ ఇండియా రేడియో సంగీత దర్శకుడు కేఎస్‌ చంద్రశేఖర్‌ కోవిడ్‌తో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ 1990లో ఆల్‌ ఇండియా రేడియోలో గ్రేడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేరారు. అల్లు రామలింగయ్య నటించిన ‘బంట్రోతు భార్య’ సినిమాతో నేపథ్య గాయకునిగా సినీరంగ ప్రవేశం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద 70కి పైగా చిత్రాలకు చీఫ్‌ అసోసియేట్‌గా చేశారు. ఆ తర్వాత రమేష్‌ నాయుడు వద్ద 40 చిత్రాలకు, హిందీలో లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ వద్ద సహాయకునిగా చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘యమకింకరుడు’ ద్వారా సంగీత దర్శకుడు అయ్యారు.

‘బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో, భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి (తమిళ్‌–హిందీ )’ ఇలా దాదాపు 30కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు చంద్రశేఖర్‌. ఆ తర్వాత విశాఖపట్నం ఆల్‌ ఇండియా రేడియో గ్రేడ్‌ 1 మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తూ ఇటీవలే పదవీ విరమణ చేశారు. తిరుపతిలో చంద్రశేఖర్‌ ప్రదర్శన చూసి ముగ్దులైన ప్రముఖ సంగీత దర్శకులు ఘంటసాల తన హార్మోనియాన్ని ఆయనకు బహూకరించారట. కీరవాణి, కోటి, మణిశర్మ వంటి సంగీత దర్శకులు చంద్రశేఖర్‌ వద్ద శిష్యరికం చేశారు. చంద్రశేఖర్‌కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు