'బాధగా ఉంది.. దేవుడా ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నావ్‌'

19 May, 2021 19:56 IST|Sakshi

ముంబై : ఓ వైపు కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రజలు అల్లాడుతుంటే టౌటే తుఫాన్‌ మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ప్రారంభమైన టౌటే తుపాను ధాటికి ముంబై సహా  చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. మే నెలలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలో 230 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.. వీధులు నీటితో నిండిపోయాయి. తుపాను ప్రభావంతో అనేక చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో ముంబైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా  ఇళ్లల్లో టీవీలు, ఇంటర్నెట్‌ కనెక్షన్లు పనిచేయడం లేదు.

ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్‌ ఫ్రం హోమ్‌) ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక టౌటే తుపాను తనకు కూడా ఎంతో నష్టం కలిగించిందని నటి రాఖీ సావంత్‌ తెలిపారు. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు తన ఇంటి బాల్కనీ పైకప్పు కుప్పకూలిపోయిందని వెల్లడించారు. ఇది చూసి తానెంతో బాధపడుతున్నానని, నిన్నటి నుంచి పైకప్పు నుంచి పడుతున్న వర్షపు నీటిని బకెట్‌తో బయట పారబోశానని తెలిపింది.

అంతేకాకుండా తుపాను ధాటికి చెట్లు విరిగిపోవడం గురించి స్పందిస్తూ.. ఇప్పటికే ప్రజలు ఆక్సిజన్‌ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే ఇలా చెట్లు విరిగిపోతే మనకు ప్రాణవాయువు ఎక్కడినుంచి వస్తుంది? ఇంకా దేవుడు ఏమేం చేయాలనుకుంటున్నాడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక  టౌటే తుపాను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించింది. తుపాను ప్రభావంతో ఇప్పటికి 100 మంది వరకు గల్లంతయినట్టు సమాచారం. ప్రస్తుతం అతి తీవ్ర తుపానుగా ఉన్న టౌటే మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు.

చదవండి : 
ఐటెం గర్ల్‌ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్‌

Amitabh Bachchan: ఆఫీసును ముంచెత్తిన వరద

మరిన్ని వార్తలు