Nagababu: రతన్‌ టాటాను రాష్ట్రపతి చేయాలి

9 Aug, 2021 16:00 IST|Sakshi

సంచలన వ్యాఖ్యలు చేసిన మెగా బ్రదర్‌

సాక్షి, హైదరాబాద్‌: మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం ఏదో అంశం మీద కామెంట్‌ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నాగబాబు రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని.. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలన్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ రాష్ట్రపతిగా రతన్‌టాటా పేరును సూచించి.. అందరిని ఆశ్చర్యపరిచారు నాగబాబు. దేశంలోనే అతి పెద్ద ఇండస్ట్రీయలిస్ట్‌లో ఒకరైన రతన్‌ టాటా తదుపరి రాష్ట్రపతి కావాలని నాగబాబు కోరుకున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. 

ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం దాదాపుగా మరో ఏడాది వరకు ఉంది. దీని పైన జాతీయ స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు చర్చలు జరుగుతున్నా...నిర్దిష్టంగా ఎవరు పోటీలో ఉంటారనే అంశం పైన మాత్రం క్లారిటీ లేదు. ఇక ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తదుపరి రాష్ట్రపతి రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కానీ దాని గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అలాంటిది ఇప్పుడు ఇంత సడెన్‌గా రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన నాగబాబు ఎందుకు స్పందించారనేది అంతు చిక్కని విషయం.

‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులును ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇలాంటి సమయంలో తదుపరి రాష్ట్రపతి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు పన్నే వ్యక్తి కాకుండా.. దేశాన్ని తన కుటుంబంలా భావించి ప్రేమించే వ్యక్తి అయితే బాగుంటుంది. భారత దేశ తదుపరి రాష్ట్రపతిగా నేను ప్రతిపాదించే వ్యక్తి ఎవరంటే రతన్‌టాటా గారు’’ అంటూ నాగబాబు ట్వీట్‌చేశారు. దాంతో పాటు #RatanTataforPresident అనే హ్యాష్‌ట్యాగ్‌ని షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. 

మరిన్ని వార్తలు