వేల మంది కళ్లు తెరిపించావు శేఖర్‌.. ఇకపై చైతూది కొత్త జర్నీ: నాగార్జున

28 Sep, 2021 22:04 IST|Sakshi

నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 24న థియేటర్లలో విడుదలై పాజటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతోందీ. దీంతో మూవీ యూనిట్‌ మంగళవారం  హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన అక్కినేని నాగార్జున విచ్చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘ లవ్ స్టోరీ అనే సినిమా తెలుగు సినిమాకే కాదు ఆల్ ఓవర్ సినిమా ఇండస్ట్రీకి ఓ ముందడుగు లాంటిది. ఒక మంచి సినిమా ఇవ్వండి.. మేము థియేటర్‌కి వస్తాము అని అంతా వచ్చారు. తెలుగు ప్రజలకు కోటి నమస్కారాలు. మా అందరికీ ఓ దైర్యం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌తో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఆనంద పడ్డారు. శేఖర్ ఓ సెన్సిటివ్ డైరెక్టర్. సెన్సిటివ్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి ఎంతో చక్కగా ఈ సినిమా రూపొందించారు.

ఫుల్ లవ్ స్టోరీ చూపించడానికి పెద్ద పెద్ద సెట్స్ అవసరం లేదు. ఒక టెర్రస్ చాలు అని నిరూపించావు శేఖర్. ఫన్ లవ్ స్టోరీ నుంచి సీరియస్ టాపిక్‌కి తీసుకెళ్ళావు. ఇలాంటి సబ్జెక్టు నాకు ఇష్టం ఉండదు.. కానీ నేను నువ్వు చూపించిన విధానానికి కనెక్ట్ అయ్యా. ఆ సన్నివేశాలు చూస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. మూడు,నాలుగు రోజులవరకు నేను అదే ఫీల్‌లో ఉన్నా. ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా ఛీ అని ఫీలయ్యా. కొన్ని వేలమంది కళ్లు తెరిపించాడు శేఖర్‌.  పవన్ ఎంతో చక్కని మ్యూజిక్ అందించారు. అశోక్ తేజ మీరు మాకు ఇంకా మరిన్ని పాటలు రాయాలి. మా జనరేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సాహిత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే ఆమె చుట్టూ వంద సాయి పల్లవులు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదో క్లాసిక్ మూవీ. చైతన్యను చూస్తుంటేనే నాకు జనరల్‌గానే కడుపు నిండి పోతుంది. ఈ సినిమా చూశాక మొత్తం కడుపు నిండిపోయింది. చైతన్యను ఓ స్టార్ యాక్టర్‌గా రెడీ చేసి కొత్త జర్నీ మొదలు పెట్టించావు. థాంక్యూ శేఖర్. చైతూ చాలా బాగా నటించాడు. ప్రేమ్‌ నగర్‌ విడుదలైన 50 ఏళ్ల తర్వాత  అదే తేదికి లవ్ స్టోరీ విడుదలైంది. తుఫాన్‌, సైక్లోన్‌, కోవిడ్‌తో పోరాడి లవ్‌స్టోర్‌ బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది’ అని నాగ్‌ అన్నారు. 

అలాగే కరోనాపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలో ఎంతో చక్కగా పోరాడాయని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు సరైన సమయంలో కరోనాపై సరైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 208 రోజుల తర్వాత తెలంగాణలో ఒక్క కరోనా మరణం లేదని, దీనికి మనమంతా సంబురాలు జరుపుకోవాలన్నారు. సినీ పరిశ్రమను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎల్లప్పుడూ చల్లగానే చూశాయని, ఇకపై కూడా మమల్ని చల్లగా ఆశీర్వదించాలని కోరారు. 

నారాయణ్‌దాస్‌ నారంగ్‌ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్‌కి థ్యాంక్స్‌. ఇండస్ట్రీకి చిరంజీవిగారు ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకి కూడా అలాగే నిలబడ్డారు.. ఆయన రాకతో మా సినిమాకి మాంచి కిక్‌ వచ్చింది’’ అన్నారు. శేఖర్‌ కమ్ముల, నాగచైతన్య మాట్లాడుతూ –‘‘ఆడియన్స్‌ వస్తారా? రారా? అనే టైమ్‌లో వారు థియేటర్స్‌కు వచ్చి మా సినిమాను ఆదరించారు. శేఖర్‌గారి కంటెంట్‌ పవర్‌ ఏంటో సెప్టెంబరు 24న తెలిసింది. సినిమా స్టార్ట్‌ చేశాక శేఖర్‌గారు, డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోని వారి నిజాయతీ చూసి ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఫిక్సైపోయాను’’ అన్నారు.

సాయిపల్లవి మాట్లాడుతూ –‘‘మా తాతగారు ‘అన్నమయ్య’ చూస్తున్నప్పుడు.. ఆత్మ దేవునితో ఐక్యమయ్యే సీన్‌ని ఏడుస్తూ.. దండం పెడుతూ చూసేవారు. ఆయన యాక్ట్‌ చేస్తున్నారు తాతయ్యా అనేదాన్ని. నేను ఇండస్ట్రీ వచ్చాక అర్థం అయ్యింది.. ఒక పాత్రను మనం చేస్తే అది నిలిచిపోయేలా చేయాలని నాకు నేర్పిన మీకు (నాగార్జున) «థ్యాంక్స్‌. ‘లవ్‌స్టోరీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అని థియేటర్స్‌కి వెళ్లా. వారి రియాక్షన్‌ చూసి కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. సురేశ్‌ బాబు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కర భట్ల, పవన్‌ సీహెచ్, మంగ్లీ, రోల్‌ రైడా, ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు