Brahmastra Movie Promotions: విజువల్‌ వండర్‌గా బ్రహ్మాస్త్ర..  'ల్యాండ్‌ మార్క్‌గా నిలుస్తుంది'

25 Aug, 2022 10:31 IST|Sakshi

బ్రహ్మాస్త్ర చిత్రంపై క్రేజ్‌ మామూలుగా లేదు. రణ్‌వీర్‌ కపూర్, అలియాభట్, అమితాబ్‌ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఫాక్స్‌ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్‌ ఫోకస్, స్టార్‌లైట్స్‌ పిక్చర్స్‌ సంస్థలు కలిసి నిర్మించిన భారీ చిత్రం ఇది. దీనికి అయన్‌ ముఖర్జీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. 3డీ ఫార్మెట్‌లో మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్‌ కథా చిత్రం తొలి భాగం సెప్టెంబర్‌ 9వ తేదీన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

తమిళంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో భాగంగా బుధవారం మధ్యాహ్నం రణ్‌బీర్‌ కపూర్, నాగార్జున, దర్శకుడు రాజమౌళి చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్‌లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా కాకుండా, చిత్ర సమర్పకుడిగా పాల్గొన్నానని తెలిపారు. బ్రహ్మాస్త్రం ఈ ఏడాది ఇండియన్‌ సినీ చరిత్రలో ముఖ్యమైన చిత్రంగా ఉంటుందన్నారు. మన పురాణ ఇతిహాసాల నుంచి తయారు చేసుకున్న కల్పిత కథా చిత్రం ఇదని చెప్పారు. ఇది చిత్ర యూనిట్‌ 8 ఏళ్ల శ్రమగా పేర్కొన్నారు. అస్త్రాల వివరాలను అందరికీ నచ్చే విధంగా చెప్పిన ఈ చిత్రంలో తానూ భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.

నాగార్జున మాట్లాడుతూ.. దర్శకుడు అయన్‌ ముఖర్జీ ఒక కామిక్‌ పుస్తకంతో తనను కలిశారని తెలిపారు. తన పాత్ర నంది అస్త్రం నేపథ్యంగా ఉంటుందన్నారు. తనకు చిన్న తనం నుంచి ఇతిహాసాలంటే ఆసక్తి అని, ఈ నేపథ్యంలోనే ఇందులో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. చిత్రంలో విజువల్స్‌ అబ్బుర పరుస్తాయన్నారు. దర్శకుడు అయన్‌ ముఖర్జీ 10 ఏళ్ల శ్రమ ఈ చిత్రం అన్నారు. రణ్‌బీర్‌ కపూర్, అలియాభట్‌లు చాలా శ్రమజీవులని ప్రశంసించారు. సినిమాను ప్రేమించేవారని, ఈ చిత్రం పెద్ద విజయం సాధించడంతో పాటు ల్యాండ్‌ మార్క్‌గా నిలిచిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది తాను నటించిన తొలి 3డీ చిత్రం అని ఆయన పేర్కొన్నారు.

నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతిని గౌరవించే సమాజంలో తాను ఈ చిత్రాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర మూల కథను దర్శకుడు తనకు 10 ఏళ్ల క్రితం చెప్పారన్నారు. ఆయన ఆలోచన తనను విస్మయ పరిచిందన్నారు. అమితాబ్‌ బచ్చన్, నాగార్జున వంటి గొప్ప నటులతో కలిసి నటించడం ఆనందకరం అన్నారు. చిత్ర షూటింగ్‌ సమయంలోనే తానూ అలియాభట్‌ కలుసుకున్నామని, ఇప్పుడు తమ పెళ్లి కూడా జరిగిందని, ఈ చిత్రం తనకు చాలా ముఖ్యం అని చెప్పారు. బ్రహ్మాస్త్రం కొత్త అనుభూతిని కలిగిస్తుందని రణ్‌బీర్‌ కపూర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు