Nallamala: ‘నల్లమల’ అంతర్యుద్ధం, గెలించిందెవరు?

30 Sep, 2021 17:14 IST|Sakshi

`నల్లమల` త‌ప్ప‌కుండా వండ‌ర్స్ క్రియేట్ చేస్తుంది:  దేవ్‌క‌ట్టా

అమిత్‌ తివారి, భానుశ్రీ హీరో,హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘నల్లమల’.రవిచరణ్‌ దర్శకత్వం వహించిన  ఈ చిత్రంలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ  త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం  ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు.

‘1980 జూలై 23,  ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం మొదలయ్యే ముందు రోజులు ఇవి. అప్పుడప్పుడే నల్లమల అడవుల్లో అంతర్యుద్ధం మొదలైంది’ అనే మాటలతో ఈ మూవీ టీజర్‌ మొదలైంది. ప్రతి సన్నివేశంలో అమిత్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ధికారం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనలు.. అందమైన అడవిలో స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.

టీజర్‌ విడుదల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాకట్టా మాట్లాడుతూ. ఈ మూవీలోని  ఏమున్నావే పిల్ల‌ పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్‌లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదు అని అసూయ పడ్డాను. అమిత్‌ను మొదటిసారి చూసినప్పుడే ఇంత మంచి యాక్టర్‌వి ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నావ్ అని అన్నాను. మంచి ఫుడ్ చాలా అరుదుగా దొరుకుతుందన్నట్టుగా అనిపించింది.ఇంత మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది.ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్‌’అని అన్నారు.

ద‌ర్శ‌కుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు దేవా కట్టా గారంటే చాలా ఇష్టం. టీజర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఓ రెండు విషయాలు చెబుతాను. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే  ఈ కథ. తరువాత సినిమా గురించి చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా కోసం పని  చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. 
 

మరిన్ని వార్తలు