ఆ సీక్వెల్‌లో నేను, నా కొడుకు కలిసి నటిస్తాం: బాలయ్య

11 Jun, 2021 07:46 IST|Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారందరికీ బాలయ్య తన పుట్టినరోజున ఓ శుభవార్త చెప్పాడు. తన కొడుకు త్వరలోనే వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడని ప్రకటించాడు.

తన 61వ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను చేస్తున్న, చేయబోయే సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముందుగా 'నర్తనశాల' చిత్రం గురించి మాట్లాడుతూ.. సౌందర్య బతికుంటే ఈ సినిమా పూర్తి చేసేవాడినన్నాడు. ద్రౌపది స్థానంలో మరో స్త్రీని ఊహించుకోలేనని, కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సినిమా తెరకెక్కించే అవకాశమే లేదని కుండబద్ధలు కొట్టేశాడు.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ గురించి స్పందిస్తూ.. "ఆదిత్య 369 సీక్వెల్‌లో అబ్బాయి, నేను కలిసి నటిస్తాం. తాతమ్మ కల వంటి పలు సినిమాల ద్వారా నాన్నగారు నాకు నటనలో మెళకువలు నేర్పించాడు. అలా నేను మోక్షజ్ఞను నా సినిమాతో పరిచయం చేస్తూ మెళకువలు నేర్పిస్తాను. ఈ సినిమాకు నేను లేదా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్‌ చేస్తారు" అని బాలయ్య చెప్పుకొచ్చాడు.

చదవండి: మీ వల్లే ఇంతటివాడినయ్యాను, ప్లీజ్‌..: బాలయ్య

మరిన్ని వార్తలు