Sirivennela Seetharama Sastry: అభిమానిని వియ్యంకుడిని చేసుకున్న ‘సిరివెన్నెల’

1 Dec, 2021 10:03 IST|Sakshi

Nanduri Ramakrishna Remembers His Relation With Sirivennela Seetharama Sastry: విశాఖకు చెందిన సాహితీవేత్త నండూరి రామకృష్ణతో సిరివెన్నెలకు మంచి స్నేహం ఉంది. ఆ స్నేహబంధాన్ని కుటుంబ బంధంగా మార్చుకున్నారు. తన కుమార్తె లలితా దేవిని నండూరి రామకృష్ణ తనయుడు వెంకట సాయిప్రసాద్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. 2001 మే 8న విశాఖలో ఈ వివాహం జరిగింది. ప్రస్తుతం అల్లుడు, కూతురు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. విశాఖ వెళ్లిన ప్రతిసారీ వియ్యంకుడు రామకృష్ణతో పాటు విశాఖలోని పలువురి స్నేహితులతో కాలక్షేపం చేసేవారు ‘సిరివెన్నెల’.

అభిమాని నుంచి వియ్యంకుడిగా..‘సిరివెన్నెల’తో తన అనుబంధం గురించి నండూరి రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘నాకు 1977 నుంచి సీతారామశాస్త్రితో సాన్నిహిత్యం ఉంది. ఆయన రచనలపై అభిమానంతో 1977లో ఆయన్ని తొలిసారి చెన్నైలో కలిశాను. ఆయన్ని కలిసేందుకు చెన్నై వచ్చానని చెప్పడంతో చాలా ఆనందపడ్డారు. 1995లో ‘గాయం’ సినిమా రివ్యూ సమయంలో ఆయన ఏయూలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో సిరివెన్నెలతో పాటు వెన్నెలకంటి, వేటూరి, భువనచంద్ర, జొన్నవిత్తులతో కలిసి వేదిక పంచుకునే అవకాశాన్ని నాకు కల్పించారు.
చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు

నాకు సాహిత్యంలో ప్రవేశం ఉండటంతో ఆ తరువాత అనేక సాహిత్య సమావేశాల్లో ఆయనతో స్నేహపూర్వకంగా మెలిగే అవకాశం దక్కింది. 2001కి ముందు జరిగిన నా కుమారుడు నండూరి సాయిప్రసాద్‌ ఒడుగు ఫంక్షన్‌కు సీతారామశాస్త్రి కూడా హాజరయ్యారు. అప్పుడే తన కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అలా మా కుమారుడుకి ఆయన కూతురు లలితా దేవితో వివాహం జరిగింది. దీంతో ఆయన అభిమాని అయిన నేను వియ్యంకుడయ్యాను. సీతారామశాస్త్రి విలువలు కలిగిన సాహిత్యాన్ని సమాజానికి అందించారు. అశ్లీలతకు ఆయన సాహిత్యంలో ఏనాడూ చోటు లేదు. ఇలాంటి మనిషిని కోల్పోవడం మా కుటుంబానికే కాదు సమాజానికీ తీరని లోటు’’ అన్నారు.
చదవండి: ఓకే గూగుల్‌, ప్లే సిరివెన్నెల సాంగ్స్‌.. గూగుల్‌ నివాళి

మరిన్ని వార్తలు