ఇంటికే వస్తున్నా: హీరో నాని

20 Aug, 2020 14:17 IST|Sakshi

ఓటీటీలో విడుదల కానున్న నాని, సుధీర్‌బాబుల ‘వి’ చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ‘‘అదిరింది.. అయ్యో అయిపోయింది. అయితేనేం మళ్లీ మళ్లీ చూస్తా. థియేటరే మీ ఇంటికి వచ్చేస్తుంది’’ అంటూ ఫ్యాన్స్‌ను టీజ్‌ చేసిన నేచురల్‌ స్టార్‌ నానీ ఎట్టకేలకు ‘వి’మూవీ విడుదలకు సంబంధించిన సస్పెన్స్‌కు తెరదించాడు. ‘‘వి’ ఇంటికి వచ్చేస్తుంది’’ అని ఓటీటీలో సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. సెప్టెంబరు 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమ్‌ కానున్నట్లు తాజాగా ట్వీట్‌ చేశాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన 25వ చిత్రం ఇలా విడుదల కావడం కూడా గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయేలా సెలబ్రేట్‌ చేసుకుందామంటూ అభిమానులను ఉద్దేశించి ఓ లేఖను షేర్‌ చేశాడు. (మళ్లీ జంటగా కనిపిస్తారా? )

‘‘గత 12 ఏళ్లుగా నా కోసం మీరు థియేటర్‌కు వచ్చారు. ఇప్పుడు నేను మీ కోసం, మీ ధన్యవాదాలు చెప్పేందుకు ఇంటికే వస్తున్నాను! మీ స్పందన తెలుసుకోవాలనే ఉత్సుకతతో పాటు.. సినిమా రిలీజ్‌ విషయంలో కొంచెం నెర్వస్‌గానూ  అనిపిస్తోంది. థియేటర్లు తెరచుకోగానే టక్‌ జగదీశ్‌తో సిద్ధంగా ఉంటా. ఒట్టు’’అంటూ ‘వి’ సినిమాను ఆదరించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఇక హీరోయిన్‌ నివేదా థామస్‌ సైతం.. ‘సెప్టెంబరు 5 నుంచి వేట మొదలు’ అని మూవీ అప్‌డేట్‌ను షేర్‌ చేశారు.    

కాగా విలక్షణ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్‌బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని‘దిల్‌’ రాజు నిర్మించారు. అదితీ రావ్‌ హైదరీ, నివేదా థామస్‌ కథానియకలుగా నటించిన ఈ సినిమాలో నాని విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు. కాగా దాదాపు 35 కోట్ల వ్యయంతో ఈ సినిమా రూపొందినట్టు ఫిల్మ్‌ నగర్‌ వర్గాల సమాచారం. ఇక కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడటంతో పలు చిన్న సినిమాలు ఇప్పటికే ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో కొన్ని భారీ చిత్రాలు కూడా ఓటీటీలో సందడి చేశాయి. అయితే దక్షిణాదిలో ఇంత బడ్జెట్‌తో రూపొంది, ఓటీటీలో విడుదలవుతున్నతొలి భారీ ‘వి’నే కావడం విశేషం. 

Poll
Loading...
మరిన్ని వార్తలు