Malli Pelli Movie: నరేశ్‌- పవిత్రల మళ్లీ పెళ్లికి బిగ్‌ షాక్‌.. సినిమా ఆపాలంటూ రమ్య పిటిషన్‌

25 May, 2023 13:47 IST|Sakshi

సీనియర్‌ నటుడు నరేశ్‌, అతడి ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా నుంచి లిప్‌ లాక్‌ వీడియో రిలీజ్‌ చేసినప్పటి నుంచి ఇదొక సెన్సేషన్‌గా మారింది. కారణం.. నరేశ్‌ నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సినిమాలో ఉండటమే! ఇందులో అతడి మూడు పెళ్లిళ్లు, పవిత్రతో ప్రేమాయణం.. హోటల్‌లో పట్టుబడ్డ సీన్‌.. ఇలా అన్నీ ఉన్నాయి.

పైగా ప్రమోషన్స్‌లోనూ పవిత్రతో రొమాన్స్‌ చేయడం, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడం విశేషం. ఎంఎస్‌ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నరేశ్‌ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా శుక్రవారం (మే 26న) విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతి. మళ్లీ పెళ్లి సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని, ఈ సినిమా విడుదల ఆపాలంటూ పిటిషన్‌ వేసింది. దీంతో మళ్లీ పెళ్లి సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది.

చదవండి: తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోను: డైరెక్టర్‌ మాస్‌ వార్నింగ్‌

మరిన్ని వార్తలు