ఏడాదికి ఎనిమిది సినిమాలు చేస్తా!

7 Sep, 2021 22:27 IST|Sakshi

‘‘నేను సినిమా రంగానికి వచ్చి 32 ఏళ్లు అవుతోంది. ఆఫీస్‌బాయ్‌ నుంచి నిర్మాత స్థాయికి ఎదిగాను. దాసరి నారాయణరావు, డి. రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ నా గురువులు. రమేష్‌ ప్రసాద్‌గారు నాకు ఆర్థికంగా అండగా నిలిచిన రోజులను మరచిపోలేను. నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’అన్నారు నిర్మాత, దర్శకుడు నట్టికుమార్‌. బుధవారం(సెప్టెంబరు8) నట్టికుమార్‌ పుట్టినరోజు.

ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఏడాది నా పుట్టినరోజున ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది నాకు మరింత ప్రియమైంది. నా కుమారుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన ‘సైకో వర్మ’, నా కుమార్తె నట్టి కరుణ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ‘డీఎస్‌జే’(దెయ్యంతో సహజీవనం) సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అలాగే 2000లో దర్శకత్వం మానేసిన నేను మళ్లీ ఇప్పుడు ‘డీఎస్‌జే’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ ఏడాది ప్రత్యేకలు ఇవి. నా కుమార్తె నట్టి కరుణ హీరోయిన్‌గా ఆర్టికల్‌ 370 అంశంపై ఓ సినిమా చేస్తున్నా. రాజశేఖర్‌గారితో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నా. మరో మూడు సినిమాలు గురించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఎనిమిది సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాను. రాజశేఖర్‌ ‘అర్జున’ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం. రామ్‌గోపాల్‌ వర్మతో నేను చేసిన సినిమాలు త్వరలో విడుదలవుతాయి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు