ఆ పేరొస్తే చాలు

9 Mar, 2021 03:19 IST|Sakshi

– నవీన్‌ చంద్ర

‘‘నేను నటుడవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను.. అంతేకానీ హీరోనా, విలనా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానా? అని ఏదో ఒకదానికి ఫిక్స్‌ అవ్వాలనుకోలేదు. ఒక మంచి కథలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే చేయడానికి అభ్యంతరం లేదు. ‘నవీన్‌  చంద్ర అన్ని రకాల పాత్రలూ చేయగలడు.. చేస్తాడు’ అనే పేరొస్తే చాలు’’ అని నవీన్‌  చంద్ర అన్నారు. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మోసగాళ్ళు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది.

అందులో ప్రధాన పాత్రలో పోషించిన నవీన్‌  చంద్ర విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ‘మోసగాళ్ళు’ కథ విన్నప్పుడు ఇంతపెద్ద కుంభకోణం జరిగిందా? అనిపించింది. ఈ సినిమాలో విష్ణు–కాజల్‌ అగర్వాల్‌లకు కజిన్‌ గా నటించా. వారికి ఎటువంటి ఆపద వచ్చినా నేను రక్షిస్తుంటా. ఎంత మేధావి అయినా తప్పు చేస్తే చివరికి శిక్ష తప్పదు? అనేది చూపిస్తున్నాం. ఇందులో నా పాత్ర డ్రగ్స్‌కి, మద్యానికి బానిసై ఉంటుంది. ‘ఎవరు’, ‘అరవింద సమేత వీరరాఘవ’ల్లో నా పాత్రలకు మంచి పేరొచ్చింది. ఇప్పటివరకూ నాకంటూ ఎటువంటి ఇమేజ్‌ లేకుండా నటుడిగా కొనసాగుతుండటం సంతృప్తిగా ఉంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు