Shah Rukh Khan: నయన్‌ పెళ్లికి వెళ్లిన షారుక్‌పై ట్రోలింగ్‌

11 Jun, 2022 21:39 IST|Sakshi

అందమైన ప్రేమకావ్యాన్ని పెళ్లితో పదిలపరుచుకున్నారు నయనతార, విఘ్నేశ్‌. తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం(జూన్‌ 9న) నాడు వేదమంత్రాల సాక్షిగా వీరు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకకు కోలీవుడ్‌ స్టార్స్‌ రజనీకాంత్‌, సూర్య, విజయ్‌, అజిత్‌ కుమార్‌, విజయ్‌ సేతుపతితో పాటు బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ కూడా హాజరయ్యారు. వీరితో పాటు తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ, కింగ్‌ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ కూడా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా షారుక్‌ పలువురు సెలబ్రిటీలతో పాటు తన అభిమానులతో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. 'ఓయ్‌' హీరోయిన్‌ షామిలీ షారుక్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ మురిసిపోయింది. చిన్నప్పటి నుంచి నేను ఎంతగానో ఆరాధిస్తున్న నా ఫేవరెట్‌ హీరోను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చింది. ఇందులో షారుక్‌ లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు షారుక్‌ను తిట్టిపోస్తున్నారు కూడా! ఎందుకంటే కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీకి వెళ్లినవారిలో కొందరికి కరోనా పాజిటివ్‌ అని వచ్చిన విషయం తెలిసిందే కదా! అందులో షారుక్‌ కూడా ఉన్నాడు. కానీ వారం రోజులకే కరోనా నుంచి కోలుకోవడంతో నయన్‌ వివాహానికి హాజరయ్యాడు. మొన్నే కరోనా వచ్చినా కూడా పెళ్లికి వెళ్లడం అవసరమా? అని పలువురు నిందిస్తున్నారు.

కాగా నయనతార, విఘ్నేశ్‌ తిరుపతిలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల అది కుదరకపోవడంతో మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వారికి మాత్రమే కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారు. అందుకోసం అన్నిదానాల్లో కన్నా గొప్పదైన అన్నదానాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షమందికి విందు భోజనం వడ్డించారు. ఇక పెళ్లైన మర్నాడే తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.

ఇక షారుక్‌ విషయానికి వస్తే అతడు 'రాజారాణి', 'బిగిల్‌', 'మెర్సల్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్లు అందించిన తమిళ దర్శకుడు అట్లీతో 'జవాన్‌' అనే సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్‌ 2న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. మరోవైపు రాజ్‌కుమార్‌ హిరానీతో 'డంకీ' మూవీ చేస్తున్నాడు షారుక్‌. అలాగే మాధవన్‌ 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌', రణ్‌బీర్‌ కపూర్‌ 'బ్రహ్మాస్త్ర' చిత్రాల్లో అతిథిగా కనిపించనున్నాడు.

చదవండి: ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్న జయమ్మ పంచాయితీ

మరిన్ని వార్తలు