Nayanthara: పెళ్లి అనంతరం అదే జోరు.. 75వ చిత్రానికి రెడీ అయిన నయన్‌

13 Jul, 2022 08:51 IST|Sakshi

సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు దశాబ్ధాలుగా ఆమె సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక ఇటీవల తమిళ డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అయినప్పటికీ తన సినీ కెరీర్‌ అదే జోరుగా కొనసాగిస్తుంది. పెళ్లి అనంతరం కూడా వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకం చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నయన్‌ ఓ భారీ ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యింది. జీ స్టూడియోస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, పార్స్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయకంగా నిర్మించే సినిమాకు నయన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇది నయన్‌కు 75వ చిత్రం కావడం విశేషం.

ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భం చిత్ర ప్రచార వీడియోతో జీ స్టూడియోస్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. చూస్తుంటే ఈ చిత్రం ఆధ్యాత్మికత నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా నీలేష్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రముఖ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇంతకు ముందు నటించని పాత్రలో నయనతారను చూస్తారని’ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అందిస్తామని నిర్మాతలు తెలిపారు. కాగా ఈ చిత్రానికి దినేష్‌ కృష్ణన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు