తండ్రి కోరిక మేరకు పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌.. త్వరలోనే ముహూర్తం

12 Jul, 2021 09:17 IST|Sakshi

ప్రముఖ హీరోయిన్‌ నయనతార తండ్రి కురియన్ కొడియట్టు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. నయనతార తండ్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి నయనతార ఇటీవలి కాలంలో ప్రత్యేక విమానంలో కొచ్చికి వచ్చి వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తన కూతురి పెళ్లిని కళ్లారా చూసుకోవాలని నయన్‌ తండ్రి ముచ్చటపడుతున్నారట. కొద్ది కాలంగా ఇదే విషయాన్ని నయన్‌తోనూ ప్రస్తావించారట.


గత నాలుగేళ్లుగా విఘ్నేశ్‌తో ప్రేమలో ఉన్న నయనతార.. పెళ్లి విషయంపై మాత్రం కాస్త వెనకడుగు వేస్తుందట. కానీ ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని  పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక తమ పెళ్లి విషయాన్ని ఈ మధ్యే విఘ్నేశ్‌ శివన్‌ సైతం అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆయన త్వరలోనే తమ పెళ్లి డేట్‌ అనౌన్స్‌ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వివాహం కూడుకున్నదని, అందుకు ఇప్పటినుంచే డబ్బులు సేవ్‌ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అతి త్వరలోనే నయన్‌-విఘ్నేశ్‌ పెళ్లి పీటలెక్కనున్నారని  తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు