కామెడీ క్వీన్‌కు ఎన్‌సీబీ సెగ

21 Nov, 2020 13:04 IST|Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ కామెడీ క్వీన్‌ భారతీ సింగ్‌కు మరో షాక్‌ తగిలింది. నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత మాదకద్రవ్యాల తుట్టె కదిలింది. బాలీవుడ్‌  ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా నటి భారతీ సింగ్ ముంబై నివాసంపై శనివారం ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దాడి చేసింది.  భారతి సింగ్‌తోపాటు, ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. డ్రగ్ పెడ్లర్ విచారణలో భారతి సింగ్‌ పేరు వెలుగులోకి రావడంతో ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం ఈ దాడులు చేపట్టింది. కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని  సీనియర్‌ అధికారి తెలిపారు. దీంతో భారతి, ఆమె భర్త హర్ష్ లింబాచియాకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. 

ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు చేసింది. రాంపాల్‌, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్‌సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్‌లో భాగమని రాంపాల్‌ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు