ముగిసిన దీపిక విచార‌ణ‌.. క్లీన్ చిట్ ఇవ్వ‌ని ఎన్సీబీ

26 Sep, 2020 20:14 IST|Sakshi

ముంబై : సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్‌ కోణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నటుడు సుశాంత్‌ సింగ్‌ మరణంతో వెలుగులోకి వచ్చిన ఈ కేసు ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ కలకలం రేపుతోంది. డ్రగ్స్‌ కేసుపై విచారణ జరుపుతున్న నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారుల ఎదుట శనివారం నటి దీపికా పదుకొనె హాజరయ్యారు. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్ హౌస్‌లో సాగిన ఆమె విచారణ ముగిసింది. మొత్తం నాలుగు రౌండ్లలో దాదాపు ఐదున్నర గంటలపాటు ఎన్సీబీ దీపికను ప్రశ్నించింది. ఈ క్రమంలో డ్రగ్స్‌ కొనుగోలు, సరాఫరా, వినియోగం, పార్టీ వంటి విషయాల్లో దీపిక నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. (డ్రగ్స్‌ కేసు: ఎన్‌సీబీ ఎదుట హాజరైన దీపికా)

అయితే దీపిక ఇచ్చిన స‌మాధానాల‌తో ఎన్సీబీ అధికారులు సంతృప్తి చెంద‌లేద‌ని తెలుస్తోంది. కరిష్మా, జయ, తదితరులతో వాట్సాప్‌ చాట్‌ నిజమేనని చెప్పిన దీపిక కొన్ని ప్రశ్నలను దాటవేస్తూ తప్పించుకునేలా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. చాలా సమయంపాటు దీపికను ఎన్సీబీ విచారించినప్పటికీ ఇంకా ఆమెకు ఈ కేసులో క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతో దీపిక‌ను ఈ కేసులో మరోసారి విచారించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఎన్సీబీ వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. (ఎన్‌సీబీ రకుల్‌ విచారణలో ఏం చెప్పింది?)

కాగా డ్రగ్‌ కేసులో దీపికతోపాటు శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ హాజరవ్వగా శుక్రవారం విచారణకు హాజరైన దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌ రెండో రోజు కూడా విచారణకు వచ్చారు. శ్రద్ధాను ఎన్‌సీబీకి చెందిన మరో బృందం విచారిస్తోంది. సుశాంత్ ఇచ్చిన ఫార్మ్‌ హౌజ్ పార్టీకి వచ్చానని అంగీకరించిన శ్రద్ధా కానీ తను డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని విచార‌ణ‌లో వెల్లడించారు. ఇదిలా ఉండగా టాలీవుడ్‌ స్టార్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శుక్రవారం ఎ‍న్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. మ‌రో వైపు ఇదే కేసులో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌విప్ర‌సాద్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు.. (దీపికకు నోటీసుల వెనుక ఇంత కుట్రనా..)

మరిన్ని వార్తలు