'ఆ వార్తలు బాధాకరం..ఈనెల 10న ఫ్లాట్‌ ఖాళీ చేస్తున్నాం'

5 Aug, 2021 15:03 IST|Sakshi

Niharika Husband Chaitanya Clarity On Case Filed: షేక్‌పేట్‌లోని అపార్ట్‌మెంట్‌ వాసులతో జరిగిన వివాదంపై నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌ వాసులు గొడవ చేయడం వల్లే పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపిన చైతన్య.. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అయితే ముందు తనమీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆగస్టు 10లోగా ఫ్లాట్‌ ఖాళీ చేస్తున్నట్లు ముందే ఓనర్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. 

'ఫ్లాట్‌ తీసుకున్నప్పుడే ఆఫీస్‌ పర్పస్‌ కోసమని ఓనర్‌కి చెప్పాం, అయితే అపార్ట్‌మెంట్‌ అసోసియయేషన్‌కు క్లారిటీ లేకపోవడంతో వాదనకు దిగారు' అని చైతన్య గొడవపై వివరణ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌ను నిహారిక దంపతులు కమర్షియల్‌గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆఫీస్‌ కోసమని ఫ్లాట్‌ తీసుకున్న విషయం తమకు తెలియదని, దీంతో వాదన జరిగినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు అందరం కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని వివరించారు. 

కాగా చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్‌మెంట్‌ వాసులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న చైతన్య అక్కడే ఆఫీస్‌ పెట్టడానికి ప్లాన్‌ చేస్తున్నాడట.  గత కొన్ని రోజులుగా ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వారు మద్యం తాగి నానా హంగామా సృష్టిస్తున్నట్లు అపార్ట్‌మెంట్‌  వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ వాసులపై కూడా చైతన్య తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్‌ వాసులు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు విచారణ జరిపి ఇరువర్గాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.కాగా చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9న ఉదై విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు