అంధాధున్‌ రీమేక్‌: తమన్నా, నభా నటేష్‌ ఫైనల్‌

19 Sep, 2020 15:40 IST|Sakshi

హైదరాబాద్‌: చాలా కాలం తర్వాత ‘భీష్మ’ సినిమాతో హిట్‌ కొట్టిన కొత్త పెళ్లి కొడుకు నితిన్‌.. ‘అంధాధున్‌’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి(నితిన్‌ తండ్రి), నిఖితారెడ్డి(నితిన్‌ సోదరి) నిర్మిస్తుండగా, ఠాగూర్‌ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడినప్పటికీ.. కరోనా కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడిన నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఓ అప్‌డేట్‌ను అందించింది. నవంబరులో సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువెళ్లనున్నట్లు తెలిపింది. అంతేగాక ఫీమేల్‌ లీడ్‌కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించింది.(చదవండి: డైరెక్ట‌ర్‌కు ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్ ఇచ్చిన నితిన్)

హీరో ఆయుష్మాన్‌ ఖురానాతో పాటు సినిమాలో మరో కీలక పాత్రధారి అయిన సీనియర్‌ నటి టబు పాత్రలో గ్లామర్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా నటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. హీరో ప్రియురాలిగా కనిపించిన రాధికా ఆప్టే రోల్‌కు నభా నటేష్‌ను ఫైనల్‌ చేసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ‘అంధాధున్‌’ సినిమాలో నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రలో జీవించిన టబు, విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి ఛాలెంజింగ్‌ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఇక తెలుగు రీమేక్‌లో తొలుత టబు పాత్రకు ప్రముఖ నటి రమ్యకృష్ణ, నయనతార, ప్రియమణి, శ్రియ పేర్లను పరిశీలించినట్లు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అదే విధంగా కథానాయిక పాత్ర కోసం వరుస విజయాలతో దూసుకుపోతున్న బుట్టబొమ్మ  పూజా హెగ్డేను సంప్రదించగా ఆమె నిరాకరించినట్టు ప్రచారం జరిగింది.

మరిన్ని వార్తలు