ప్రీలుక్‌ రిలీజ్‌: ‘చెక్’‌ పెట్టనున్న నితిన్‌

1 Oct, 2020 17:29 IST|Sakshi

ఈ ఏడాది ‘భీష్మ’ సినిమాతో అందరిని ఆకట్టుకున్న హీరో నితిన్‌ ప్రస్తుతం ‘రంగ్‌దే’ సినిమా చేస్తున్నాడు. కీర్తీ సురేశ్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రంగ్‌దే సినిమానే కాకుండా నితిన్‌.. బాలీవుడ్‌ ‘అంధాధున్‌’ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై సుధాకర్‌రెడ్డి(నితిన్‌ తండ్రి), నిఖితారెడ్డి(నితిన్‌ సోదరి) నిర్మిస్తుండగా, ఠాగూర్‌ మధు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. నవంబరులో సినిమాను సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇక ఈ మధ్యే పెళ్లి చేసుకున్న నితిన్‌ ఇటు కొత్త సినిమాలను కూడా వెనువెంటనే ఓకే చెప్పెస్తున్నాడు. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే నితిన్‌ త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. (అన్ని జాగ్రత్తలతో సెట్స్‌ పైకి...)

ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం,సాహసం, మనమంతా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో కొత్త సినిమాను చేసేందుకు నితిన్‌ తయారయ్యాడు. దీనికి సంబంధించిన ప్రకటనను ఈ రోజు(గురువారం) డైరెక్టర్‌ కొరటాల శివ అధికారికంగా విడుదల చేశారు. సినిమా పేరును చెక్‌గా ప్రకటిస్తూ ప్రీ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నాకు ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర​ యేలేటి, హీరో నితిన్‌ల కొత్త సినిమా ప్రీ లుక్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

వీ ఆనంద్‌ నిర్మాతగా వ్యవహిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ సోస్టర్‌ను చూస్తుంటే చేతికి సంకేళ్లు, చెస్‌లోని కాయిన్స్‌తోపాటు ఇనుప కంచె కన్పిస్తోంది. దీంతో డిఫరెంట్‌ జోనర్‌లో సాగే థ్రిల్లర్‌ మూవీగా, ఇప్పటి వరకు నితిన్‌ నటించిన అన్ని సినిమాల కంటే కాస్తా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉత్తమ జాతీయ అవార్డుతోపాటు చంద్రశేఖర్‌ రెండు నంది అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. (డైరెక్ట‌ర్‌కు ఖ‌రీదైన గిఫ్ట్ ఇచ్చిన నితిన్)

మరిన్ని వార్తలు