సల్మాన్‌ ‘రాధే’కు పోటీయే లేదు.. ‘సత్యమేవ జయతే 2’ వాయిదా

27 Apr, 2021 16:55 IST|Sakshi

సాధారణంగా ఈద్‌ పండుగ అంటే బాలీవుడ్‌లో పెద్ద సినిమాల సందడి మాములుగా ఉండేది కాదు. కానీ కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది బాలీవుడ్‌లో పెద్ద చిత్రాలేవీ రాలేదు. ప్రతి ఏడాది ఈద్‌ సందర్భంగా ఓ సినిమాను విడుదల చేసే సల్మాన్‌ ఖాన్‌ సైతం గత ఏడాది ఖాళీగా ఉన్నాడు.  ఇక ఈ సారి ఏదేమైనా ఈద్‌కి వచ్చేస్తానని ప్రకటించాడు సల్మాన్‌. అన్నట్లుగానే ఈద్‌ సందర్భంగా తన లేటెస్ట్‌ సినిమా ‘రాధే- యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ని మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలలో కూడా విడుదల చేయనున్నాడు.

మరోవైపు జాన్‌ అబ్రహం ’సత్యమేవ జయతే 2' కూడా అదే రోజు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద జాన్‌ అబ్రహంకి, సల్మాన్‌కి మధ్య వార్‌ తప్పదని భావించారు అంతా. కానీ జాన్‌ అబ్రహం ఒక అడుగు వెనక్కి వేశాడు.  తన సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. అందువల్ల మా సత్యమేవ జయతే సినిమాను వాయిదా వేస్తాం. తర్వాత రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం’ అంటూ 'సత్యమేవ జయతే2' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

దీంతో ఒక్క ‘రాధే’ తప్ప, ఇతర సినిమాలేవి థియేటర్లలో విడుదల కావడంలేదు. బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని పరిశ్రమలు కూడా తాజా సినిమాల విడుదలను వాయిదా వేస్తున్నాయి. ఇక టాలీవుడ్ లో చిరంజీవి ‘ఆచార్య’తో పాటు నాగచైతన్య 'లవ్‌స్టోరీ', రానా దగ్గుబాటి 'విరాటపర్వం', విశ్వక్‌సేన్‌ 'పాగల్'‌ సినివాలు కూడా వాయిదాపడ్డాయి. 

మరిన్ని వార్తలు