సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు మూతబడతాయనే వదంతులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. థియేటర్ల బంద్ ప్రచారంలో నిజంలేదన్నారు. కోవిడ్ నిబంధనలతో థియేటర్లు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. అయితే, థియేటర్ల యజమానులు సినిమా హాళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించేలా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
థియేటర్లను మూసివేస్తారంటూ వస్తోన్న ప్రచారాన్ని నమ్మకూడదని ఆయన ప్రజలకు సూచించారు. థియేటర్లు మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళ్తుందని, వేలాది మంది కార్మికులు రోడ్డునపడే పరిస్థితి ఉంటుందన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించే థియేటర్లను యథావిధిగా కొనసాగించే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.అందరూ కరోనా నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు.
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సినిమా దియేటర్లు యధావిధిగా నడుస్తాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో దియేటర్లు మూతపడనున్నాయని జరుగుతున్న ప్రచారం అబద్దం. సినిమా దియేటర్ల మూసివేత పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. @KTRTRS @KChiruTweets @iamnagarjuna @baraju_SuperHit @vamsikaka pic.twitter.com/yDRU8dydcj
— Talasani Srinivas Yadav (@YadavTalasani) March 24, 2021