No Time To Die: త్రీడీలో విడుదల కానున్న మొదటి జేమ్స్‌బాండ్‌ మూవీ ఇదే..!

25 Sep, 2021 13:51 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌బాండ్‌ చిత్రాలకి ఉన్న ఫ్యాన్‌ బేస్‌ తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 24 సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం డేనియ‌ల్ క్రేగ్ ప్రధాన పాత్రలో 25వ మూవీగా ‘నో టైమ్ టూ డై’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మొట్టమొదటి సారి ఓ బాండ్‌ మూవీని ఇండియాలో 3డీలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

కరోనా ఉన్న ఈ సమయంలో ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారో లేదోనని అందరూ సంశయంలో ఉన్నారు. ఈ తరుణంలో విడుదలైన హాలీవుడ్‌ మూవీ ‘షాంగ్‌ ఛీ: ది లెజెండ్‌ ఆఫ్‌ ది టెన్‌ రింగ్స్‌’ ఇండియాలో కూడా మంచి కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. దీంతో జేమ్స్‌బాండ్‌ ‘నో టైమ్‌ టూ డై’ చిత్రాన్ని భారీ స్థాయిలో 1600పైగా  స్క్రీన్లలో సెప్టెంబ‌ర్ 30న చిత్రాన్ని 2డీ, త్రీడీలో విడుద‌ల చేయనున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, ఇంగ్లీష్ భాష‌ల‌లో రిలీజ్ కానుంది. ఇంతకుముందు ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9 వంటి ఇతర సినిమాలు ప్రపంచం అంతా త్రీడిలో విడుదలైన ఇక్కడ మాత్రం 2డీలోనే రిలీజ్‌ చేశారు. ఈ సమయంలో ఈ సినిమాని 3డీ విడుదల చేయనుండడం విశేషం.

అయితే గతేడాది విడుదల అవ్వాల్సిన ఈ మూవీ కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌ ప్రేక్షకాదరణని పొందింది. కారీ జోజి దర్శకత్వం వహిస్తున్న ‘నో టైమ్‌ టూ డై’ అమెరికాలో మాత్రం కొంచెం లేట్‌గా అక్టోబరు 8న ప్రేక్షకులను పలకరించనుంది.

చదవండి: జేమ్స్‌బాండ్‌ ఫైట్‌సీన్‌కి 32వేల లీటర్ల కూల్‌డ్రింక్స్‌!

మరిన్ని వార్తలు