జయప్రదకు ఎన్టీఆర్‌ చలనచిత్ర పురస్కారం

25 Nov, 2022 03:46 IST|Sakshi

ప్రముఖ నటి జయప్రదని ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారం వరించింది. హీరో బాలకృష్ణ గౌరవ అధ్యక్షతన, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ నేతృత్వంలో తెనాలిలో ఎన్టీఆర్‌ శతజయంతి మహోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 27 సాయంత్రం నాజర్‌పేట ఎన్వీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రచయిత సాయిమాధవ్‌ బుర్రా సభా నిర్వహణలో ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరగనుంది.

ఈ వేడుకలో జయప్రదకు ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ అందించనున్నారు. అలాగే ఈ నెల 28న ‘అడవి రాముడు‘ సినిమాను ప్రదర్శించనున్నారు. జయప్రద, రామకృష్ణ, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాను వీక్షించనున్నారు. 

మరిన్ని వార్తలు