నన్ను జడ్జ్‌ చేయకండి: నుస్రత్‌ జహాన్‌

8 Jan, 2021 12:06 IST|Sakshi

నుస్రత్‌ జహాన్‌ రూహీ.. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి రాకముందు దాదాపు ఇరవై సినిమాల్లో నటించారామె. ఆ సమయంలోనే నిఖిల్‌ జైన్‌ను పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఈ జంట బంధం బీటలు వారిందనే వార్త నెట్టింట వీర విహారం చేస్తోంది. అంతేకాదు, నుస్రత్‌ తన సహనటుడు యశ్‌దాస్‌గుప్తాతో అత్యంత సన్నిహితంగా మెలుగుతోందని, త్వరలోనే భర్తకు విడాకులు ఇచ్చేయనుందని గుసగుసలు పెడుతున్నారు. పైగా ఆమె యశ్‌తో కలిసి రాజస్తాన్‌కు వెళ్లి రావడంతో ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చినట్లైంది. ఈ క్రమంలో నుస్రత్‌, యశ్‌ వీటిపై స్పందించారు. (చదవండి: డేటింగ్‌ యాప్‌లో నా ఫొటో యాక్షన్‌ తీస్కోండి)

మొదట నుస్రత్‌ మాట్లాడుతూ.. "నా వ్యక్తిగత విషయాలన్నీ అందరికీ చెప్పలేను. ఎప్పుడూ నన్ను తప్పు పట్టేందుకు రెడీగా ఉంటారు. కానీ ఈసారి మాత్రం మీ ప్రశ్నలకు, సందేహాలకు జవాబివ్వను. నటిగా నేను చేసిన తప్పొప్పుల గురించి నన్ను నిలదీయండి, సహిస్తాను. అంతే కానీ ఇతర విషయాల్లో నన్ను జడ్జ్‌ చేయకండి. ఇకపై నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా మీతో పంచుకోను" అని కుండ బద్ధలు కొట్టినట్లు‌ తేల్చి చెప్పారు. "ప్రతి ఒక్కరూ విహార యాత్రలకు వెళ్తారు కదా! అలాగే నేను కూడా ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాజస్తాన్‌ వెళ్లొచ్చాను. ఇక నుస్రత్‌ పెళ్లి విషయం అంటారా? ఆమెకు ఏం సమస్యలున్నాయో నన్నడిగితే నాకేం తెలుస్తుంది? వాటి గురించి నేరుగా ఆమెనే అడగండి" అని యశ్‌దాస్‌ గుప్తా అసలు సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాగా సినీ గ్లామర్, పొలిటికల్‌ గ్లామర్‌ రెండూ ఉన్న యువ పార్లమెంటేరియన్‌ నుస్రత్‌ ఫొటో ఆ మధ్య డేటింగ్‌ యాప్‌లో ప్రత్యక్షమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ లోక్‌సభ ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఆమెకు మమతాబెనర్జీ పిలిచి మరీ సీటిస్తే బసిర్హాట్‌ లోక్‌సభ నియోజవర్గానికి పోటీ చేసి బీజేపీ ప్రత్యర్థి మీద మూడున్నర లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు.
(చదవండి: అమ్మతోడు... ఆమె అలా చేస్తుందనుకొలేదు!)

మరిన్ని వార్తలు