థ్రిల్లింగ్‌ స్టేషన్‌

11 Sep, 2020 06:43 IST|Sakshi

కన్నడంలో దాదాపు 25 సినిమాల్లో పలు ప్రముఖ పాత్రల్లో నటించారు వశిష్ట సింహా. తెలుగులో ఆయన హీరోగా చేస్తున్న తొలి చిత్రం ‘ఓదెల రైల్వేస్టేషన్‌’. వశిష్ట సరసన పల్లెటూరి అమ్మాయి పాత్రలో హెబ్బా పటేల్‌ నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్‌లో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్‌ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా అశోక్‌తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మేకప్, డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఓదెల అనే గ్రామంలో జరిగిన వాస్తవ ఘటనతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

మరిన్ని వార్తలు