ట్రాఫిక్‌ రేస్‌లో నడిపే బండి కాదు, ఎవరు నడుపుతున్నారన్నదే ముఖ్యం

11 Apr, 2021 00:22 IST|Sakshi

‘ట్రాఫిక్‌ రేస్‌లో నడిపే బండి ముఖ్యం కాదు.. ఎవరు నడుపుతున్నారన్నదే ముఖ్యం, మీరు ఇల్లీగల్‌ రేసింగ్‌ చేస్తున్నారు, మన దేశం గురించి తెలుసుకోవాలంటే ఒక్కొక్కళ్ల ఇంటికి వెళ్లక్కర్లేదు సర్‌.. రోడ్లు చెప్పేస్తాయ్‌ దేశం గురించి’ వంటి డైలాగులతో ‘ఒరేయ్‌ బామ్మర్ది’ టీజర్‌ విడుదలైంది. ‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ సిద్ధార్థ్‌ , సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ఒరేయ్‌ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ ఫేమ్‌ శశి దర్శకత్వం వహించారు. కశ్మీరా పరదేశి, లిజోమోల్‌ జోస్‌ కథానాయికలు.

రమేష్‌ పి. పిళ్లై నిర్మించిన ఈ సినిమాని శ్రీలక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌పై ఏ.ఎన్‌ బాలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. టీజర్‌ని బట్టి చూస్తే బైక్‌ రేస్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఏ.ఎన్‌ బాలాజీ మాట్లాడుతూ – ‘‘యాక్షన్‌ ఓరియంటెడ్‌ మూవీ ఇది. సిద్ధార్థ్, ప్రకాష్‌ పోటాపోటీగా నటించారు. వీరి మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్‌ లుక్స్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్‌ కూడా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.

మరిన్ని వార్తలు