OTT-Web Series: ఓటీటీకే మొగ్గు చూపుతున్న బాలీవుడ్‌ అగ్ర దర్శకులు

23 Sep, 2022 08:35 IST|Sakshi

టెక్నాలజీ పెరిగిన తర్వాత డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విస్తృతి పెరిగింది. దీంతో అగ్ర నటీనటులు ఓటీటీ ప్రాజెక్ట్స్‌పై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దర్శకులు కూడా ఓటీటీకి ఓకే చెబుతున్నారు. అలా హిందీ చిత్రసీమలో కొందరు దర్శకులు చేస్తున్న వెబ్‌ సిరీస్‌లు, వెబ్‌ ఫిల్మ్స్‌ గురించి తెలుసుకుందాం.

⇔ ‘దేవదాస్‌’, ‘బ్లాక్‌’, ‘రామ్‌లీల’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’, ‘గంగూబాయి కతియావాడి’ వంటి హిట్‌ చిత్రాలు తెరకెక్కించిన అగ్రదర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ప్రస్తుతం ‘హీరామండి’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా రానున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సోనాక్షీ సిన్హా, అదితీరావ్‌ హైదరీ, మనీషా కొయిరాల తదితరులు

⇔ ‘గోల్‌మాల్‌’, ‘సింగమ్‌’ ఫ్రాంచైజీలతో పాటు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘సింబ’ వంటి  చిత్రాలతో కమర్షియల్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు రోహిత్‌ శెట్టి. ఇదే కమర్షియల్‌ క్రేజ్‌ను డిజిటల్‌ వరల్డ్‌లో కూడా రిపీట్‌ చేయాలను    కుంటున్నారాయన. ఇందులో భాగంగానే ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ పోలీసుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుంది. ఇందులో సిద్ధార్థ్‌ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన తారాగణం. 

⇔ వెబ్‌ వరల్డ్‌లో ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ ఆంథాలజీకి మంచి వ్యూయర్‌షిప్‌ లభించింది. ఈ ఆంథాలజీలోని ఓ భాగానికి దర్శకత్వం వహించారు జోయా అక్తర్‌. ఇప్పుడు సోలోగా ఓ వెబ్‌ఫిల్మ్‌ చేస్తున్నారామె. అమెరికన్‌ కామిక్‌ బుక్‌ ‘ది అరీ్చస్‌’ ఆధారంగా ఈ వెబ్‌ ఫిల్మ్‌ తీస్తున్నారు. ఈ వెబ్‌ ఫిల్మ్‌తోనే అమితాబ్‌ బచ్చన్‌ మనవడు అగస్త్యా నంద, షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా, బోనీకపూర్‌–దివంగత ప్రముఖ నటి శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ యాక్టర్స్‌గా ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఇక ‘జిందగీ నా మిలేగీ దోబారా’, ‘గల్లీ బాయ్‌’ వంటి చిత్రాలతో జోయా అక్తర్‌ దర్శకురాలిగా సుపరిచితురాలే. 

⇔ ‘బరేలీ కీ బర్ఫీ’, ‘పంగా’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు అశ్వనీ అయ్యర్‌ తివారి (ప్రముఖ దర్శకుడు నితీష్‌ తివారి భార్య).  ఇప్పటికే భర్త నితీష్‌తో కలిసి ‘బ్రేక్‌ పాయింట్‌’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో భాగస్వామ్యులయ్యారు అశ్వని. ఇప్పుడు సోలోగా ‘ఫాదు’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే పాయింట్‌తో పావైల్‌ గులాటి, సయామీ ఖేర్‌ ముఖ్య తారలుగా ఈ సిరీస్‌ తీస్తున్నారు అశ్వనీ. 

రెండో సిరీస్‌తో... 
కొందరు దర్శకులు రెండో వెబ్‌ సిరీస్‌కి రెడీ అయ్యారు. ఆ వివరాల్లోకి వస్తే... 
⇔ సల్మాన్‌ ఖాన్‌తో ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలను తీసిన దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ తొలిసారిగా ‘తాండవ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేశారు. తాజాగా షాహిద్‌ కపూర్‌ లీడ్‌ రోల్‌లో ‘బ్లడీ డాడీ’ అనేæసిరీస్‌ తీశారు. ఇక ‘స్కామ్‌ 1992’తో ఓటీటీలో సంచలనం సృష్టించిన దర్శకుడు హన్సల్‌ మెహతా తాజాగా భారత జాతిపిత మహాత్మాగాంధీ జీవితం ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్‌ తీస్తున్నారు. ఇందులో ప్రతీక్‌ గాంధీ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ‘కహానీ’, ‘బద్లా’ వంటి హిట్‌ సినిమాలు చేసిన సుజోయ్‌ ఘోష్‌ ఇప్పటికే ‘టైప్‌ రైటర్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చేశారు.

ఈ దర్శకుడు ప్రస్తుతం కరీనా కపూర్‌తో ఓ వెబ్‌ సిరీస్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ‘సాక్రెడ్‌  గేమ్స్‌’ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ వరల్డ్‌లోకి వెళ్లిన అనురాగ్‌ కశ్యప్‌ మరో వెబ్‌ సిరీస్‌కు కథ రెడీ చేశారట. ఇక హిట్‌ చిత్రాలు ‘క్వీన్‌’, ‘సూపర్‌ 30’ ఫేమ్‌ దర్శకుడు వికాశ్‌ బాల్‌ రెండో వెబ్‌ సిరీస్‌గా ‘ది క్యాన్సర్‌ బిట్చ్‌ చేస్తున్నారు. ‘సన్‌ ఫ్లవర్‌’ అనే సిరీస్‌తో వికాశ్‌ వెబ్‌ ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు మరికొందరు దర్శకులు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌లు, వెబ్‌ ఫిల్మ్‌లు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు