Tollywood OTT Releases: ఈ వారంలో ఓటీటీకి వచ్చేస్తోన్న తెలుగు సినిమాలివే!

28 Sep, 2023 13:04 IST|Sakshi

సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లలో మొదటి వారం మినహాయిస్తే వెళ్లేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. సూపర్‌ హిట్‌ టాక్ వచ్చిన సినిమాలు కనీసం నెల రోజులైనా థియేటర్లలో సందడి చేస్తున్నాయి. యావరేజ్ టాక్ ఉన్న సినిమాలైతే ఏకంగా నెలలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ప్రతివారం లాగే ఈసారి కూడా మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరీ ఆ చిత్రాలేంటో ఓ లుక్కేద్దాం. 

సమంత, విజయ్ 'ఖుషి'

విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది. అక్టోబర్‌ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు ఒటీటీ దిగ్గజం ప్రకటించింది.

నిత్యామీనన్-  'కుమారి శ్రీమతి' (వెబ్‌ సిరీస్‌)


నిత్యామేనన్‌ కీలక పాత్రలో గోమఠేష్‌ ఉపాధ్యాయ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌సిరీస్‌ కుమారి శ్రీమతి. ఈ సిరీస్‌లో గౌతమి, తిరువీర్‌, నిరుపమ్‌, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్‌, ప్రేమ్‌ సాగర్‌, నరేష్‌, మురళీమోహన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా సెప్టెంబరు 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.  

దుల్కర్ సల్మాన్- కింగ్ ఆఫ్ కోత

 
సీతారామంతో సూపర్‌ స్టార్‌గా మారిపోయిన దుల్కర్‌ సల్మాన్‌ నటించిన గ్యాంగ్‌స్టర్‌ మూవీ కింగ్ ఆఫ్ కోత. దుల్కర్‌ స్నేహితుడు అభిలాష్‌ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు నెలాఖరులో విడుదలై ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబర్‌ 29 నుంచి మలయాళం, తెలుగులో స్ట్రీమింగ్‌ కానుంది.

పాపం పసివాడు

సింగర్ శ్రీరామ చంద్ర, గాయత్రి చాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ పాపం పసివాడు. వీకెండ్‌ షో బ్యానర్‌పై రూపొందిన ఈ సిరీస్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. లవ్‌ ఫెయిల్‌ అయిన అబ్బాయిని ముగ్గురు అమ్మాయిలు ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది ఈ సిరీస్‌ కథాంశం. ఈ వెబ్‌సిరీస్‌ సెప్టెంబర్‌ 29 నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

సైలెంట్‌గా వచ్చేసిన ఎల్‌జీఎమ్‌

భారత క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని ‘ఎల్‌జీఎమ్‌’తో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హరీష్‌ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో తెరకెక్కించిన ఈ చిత్రానికి రమేష్‌ తమిళ్‌మణి దర్శకత్వం వహించారు. సాక్షి ధోని, వికాస్‌ హస్జా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఆగస్టు 4న విడుదలైంది. అయితే ఎలాంటి హడావుడి లేకుండానే ఈనెల 28 నుంచే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు