అదీ సల్లు భాయ్‌ రేంజ్‌.. ‘రాధే’ దెబ్బకు సర్వర్‌ క్రాష్‌

14 May, 2021 15:05 IST|Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. స‌ల్లుభాయ్ నుంచి సినిమా వ‌చ్చిందంటే చాలు బాలీవుడ్‌లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయి. అయితే స‌ల్మాన్ స్టామినా కేవ‌లం థియేట‌ర్ల‌కే ప‌రిమితం కాలేదు ఓటీటీలోనూ త‌న‌కు సాటిలేద‌ని చాటి చెప్పారు.

ఆయన తాజాగా నటించిన ‘రాధే’ సినిమా ఈద్‌ కానుకగా గురువారం (మే 13)విడుదలైంది. కరోనా కారణంగా థియేటర్లతో పాటు ఏకకాలంలో ఓటీటీలోనూ విడుదల చేశారు. కరోనా భయంతో జానాలు థియేటర్లకు వెళ్లి చూడలేదు కానీ, ఓటీటీలో చూసేందుకు మాత్రం ఎగబడ్డారు. ఈ సినిమాను మేక‌ర్స్ ఓటీటీ జీ5, జీప్లెక్స్‌ల్లో విడుద‌ల చేశారు. దీంతో గురువారం సల్మాన్‌ ఖాన్‌ అభిమానులు పెద్ద ఎత్తున జీ5, జీప్లెక్స్‌ లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో స‌ర్వ‌ర్ క్రాష్ అయ్యింది.

అయితే.. సర్వర్లు ఆగిపోవడానికి గల కారణాలు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు. సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం’ అని ట్విటర్‌లో పేర్కొంది. కొంత సమయం తర్వాత సర్వర్లు యధావిధిగా పని చేయడంతో ప్రేక్షకులు సినిమాను ఎటువంటి అంతరాయం లేకుండా వీక్షించారు. ‘రాధే సినిమాపై మీరు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ మరో ట్వీట్‌లో జీ5 తెలిపింది.

మరిన్ని వార్తలు