ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి! 

13 Apr, 2023 03:20 IST|Sakshi

గుణశేఖర్‌

‘రుద్రమదేవి’ తర్వాత  ‘హిరణ్య కశ్యప’ సినిమా స్క్రిప్‌్ట, ప్రీ ప్రొడక్షన్‌పై ఐదేళ్లు వర్క్‌ చేశాను. షూటింగ్‌ ఆరంభించే టైమ్‌లో కోవిడ్‌ వచ్చింది. దీంతో అప్పుడు మాతో కలిసి ఉన్న ఓ హాలీవుడ్‌ సంస్థ మరో వర్క్‌పై ఫోకస్‌ పెట్టింది. ఈ కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాం.   

లాక్‌డౌన్‌ టైమ్‌లో కొన్ని పురాణాలు, ఇతిహాసాల కలయికలో ఓ ప్రేమకథ చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాకు నచ్చింది. దాన్ని సోషలైజ్‌  చేయటమెందుకు.. అలాగే తీస్తే బెటర్‌ కదా అని ‘శాకుంతలం’ మొదలుపెట్టాను. సాధారణంగా శకుంతల అనగానే శృంగార శకుంతల గుర్తుకొచ్చేలా ఇప్పటివరకూ చూపించారు. కానీ, ఆమెలో అంతర్గతంగా చాలా శక్తి, ఆత్మాభిమానం ఉంటుందని ‘అభిజ్ఞాన శాకుంతలం’లో  కాళిదాసు ప్రస్తావించారు. నేను కూడా శకుంతల లోని రెండో కోణంతో కథ అల్లుకుని, ‘శాకుంతలం’ తీశాను.   

♦ తన ఆత్మాభిమానం కోసం అప్పట్లో రాజు, రాజ్యాలను శకుంతల లెక్క చేయకుండా పోరాడి నిలబడింది. పెళ్లి కాకుండా తల్లి కావటం అనేది అప్పట్లో పెద్ద నేరం. అలాంటి పరిస్థితులను ఆమె ఎలా ఎదురొడ్డి నిలబడిందనేది ఈ చిత్రకథాంశం.

♦ సమంత చాలా మంచి నటి. అందుకే శకుంతల పాత్రలో రొమాంటిక్‌ యాంగిల్‌ను సెకండ్రీ చేశా. నటనకు ప్రాధాన్యం ఉండేలా చూపించాను. నేను, అరుణ బిక్షుగారు, సమంతగారు కలిసి మాట్లాడుకుని శకుంతల పాత్రను డిజైన్‌ చేశాం. సమంత కొత్త హీరోయిన్‌లా అరుణ బిక్షుగారి వద్ద శిక్షణ తీసుకుని నటించింది.

♦ ‘శాకుంతలం’లో దుర్వాస మహామునిగా మోహన్‌బాబుగారు నటించారు. ఆ పాత్రని ఆయన తప్ప మరొకరు చేయలేరు. ఆయన ఒప్పుకోకుంటే ఈ ప్రాజెక్ట్‌ గురించి నేను ఆలోచనలో పడేవాణ్ణి. 

♦ అమితాబ్‌ బచ్చన్, సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌.. ఇలా బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అతిథి పాత్రలు చేస్తున్నారు. ఆ విషయంలో మన తెలుగు హీరోలు మారాలి. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్‌ది అతిథి పాత్ర అయినా అద్భుతమైన స్పందన వచ్చింది. ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రలో చాలా కోణాలుంటాయి. ఆ పాత్రని తెలుగు హీరోలు చేస్తారనే నమ్మకం నాకు కలగలేదు. అడిగి లేదనిపించుకోవటం ఇష్టం లేక వారిని సంప్రదించలేదు. దేవ్‌ మోహన్‌ ‘శాకుంతలం’ పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనన్నాడు. అతనికి శిక్షణ ఇప్పించి దుష్యంతుడి పాత్ర చేయించుకున్నాను.

మరిన్ని వార్తలు