Gopichand: తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే..

21 Jun, 2022 18:10 IST|Sakshi

గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్‌తో బిజీ అయ్యాడు గోపీచంద్‌. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరు. ఆయన నన్ను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారు. అది ఫస్ట్‌ మూవీ కావడంతో నేనెలా చేస్తానో అని చాలామందికి అనుమానపడ్డారు. చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆరునెలల వరకు ఏ సినిమా రాలేదు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల విలన్‌గా చేశాను. నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి. ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను.

చిన్నప్పుడు నా అన్న ప్రేమ్‌చంద్‌ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడు. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నా.. రక్తం కారి నా పళ్లెంలో నిండిపోయింది. ఇక నా చిన్నతనంలో అంటే దాదాపు నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది' అని ఎమోషనలయ్యాడు గోపీచంద్‌.

ఆ తర్వాత మారుతి తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఒకసారి ల్యాబ్‌కు వెళ్లినప్పుడు.. సినిమా ఫస్ట్‌ కాపీ చూసి తక్కువ నిడివిలో తీయాలి, ఇలా తీయకూడదు అని సూచించాను. దానికాయన నువ్వు డైరెక్టర్‌ అయి సినిమా తీయు, తెలుస్తుంది. అప్పుడు ఎలా తీయాలో మాకు చెప్పండి, నేర్చుకుంటాం అంటూ నానామాటలు అన్నారు' అని గుర్తు చేసుకున్నాడు.

చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి
టాలీవుడ్‌లో సినీ కార్మికుల సమ్మె సైరన్‌, షూటింగ్స్‌ బంద్‌!

మరిన్ని వార్తలు