తమిళ సినిమా: ఎలాంటి తారలు అయినా మొదట్లో అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిందే. అవమానాలను భరించాల్సిందే. అయితే కథానాయికలకు ఆరంభ కష్టాలు అంతంత మాత్రమేని చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్గా వెలిగిపోతున్న నయనతార కూడా అలాంటి గడ్డు పరిస్థితులను దాటి వచ్చిన వారే. పురుషాధిక్యత అధికం అని చెప్పబడే ఈ సినిమా రంగంలో నయనతార ఆరంభ కాలంలో పలు అవమానాలను ఎదుర్కొని మానసిక వేదనలను అనుభవించినవారే.
ఇంకా జీవితంలో పలు ఎత్తు పల్లాలను చవి చూశారు. అయ్యా చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ నయనతార. అయితే అంతకు ముందే పార్థిపన్ కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన కొడైకుల్ మళై చిత్రం ద్వారా పరిచయం కావలసి ఉంది. అయితే ఆమెను పార్థిబన్ రావొద్దని చెప్పారట. ఈ సంఘటన గురించి ఆయన ఇటీవల ఒక భేటీలో చెప్పారు.
(చదవండి: ఛాతిపై పచ్చబొట్టుగా పవర్స్టార్ పేరు..పిక్ వైరల్)
నయనతార ఫొటో ఒకటి చూసి తాను దర్శకత్వం వహించనున్న కొడైకుల్ మళై చిత్రంలో ఆమెను కథానాయకిగా నటింపజేయాలని భావించానన్నారు. దీంతో కేరళకు చెందిన నయనతారను ఒక రోజు ఉదయం 8 గంటలకు రమ్మని చెప్పానన్నారు. అయితే ఆమె ఆ రోజు రాకుండా, మరుసటి రోజు ఫోన్ చేసి నిన్న రాలేకపోయానని, ఈ రోజు బస్సు ఎక్కి రేపు ఉదయం కచ్చితంగా వస్తాను అని చెప్పారన్నారు. చాలా కోపానికి గురైన తాను లేదు నువ్వు రావొద్దు అని చెప్పానన్నారు. కాగా, అలా కేరళ నుంచి బస్సులో వస్తున్నా.. అని చెప్పిన నయనతార ఈ రోజు లేడీ సూపర్ స్టార్గా ఎదగడం గొప్ప విషమని కొనియాడారు.