Paruchuri Gopala Krishna: మొదటిసారి మహేశ్‌బాబు పెదాలపై చిరునవ్వు మాయమైంది

12 Oct, 2022 20:34 IST|Sakshi

టాలీవుడ్‌ సీనియర్‌ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా విశ్లేషకుడిగా మారిన విషయం తెలిసిందే! ఏదైనా సినిమాను తీసుకుని అందులో తప్పొప్పులను చర్చిస్తూ ఆ లోపాలను సవరిస్తున్నాడు. ఈ మధ్యే వారియర్‌ సినిమాలోని ప్లస్‌ మైనస్‌ల గురించి వీడియో చేసిన ఆయన తాజాగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు కుటుంబం గురించి మాట్లాడాడు. ఇటీవలే ఇందిరా దేవిని పోగొట్టుకుని మహేశ్‌ ఫ్యామిలీ పుట్టెడు శోకంలో మునిగిపోయింది. ఆమె సంస్మరణ సభకు పరుచూరి గోపాలకృష్ణ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో మహేశ్‌, కృష్ణల పరిస్థితి చూసి విలవిల్లాడిపోయానన్నాడు పరుచూరి.

'ఘట్టమనేని కుటుంబంతో నాకున్న అనుబంధాన్ని ఎన్నోసార్లు తెలియజేశాను. కృష్ణ, మహేశ్‌బాబు, రమేశ్‌ బాబు, హనుమంతురావు, ఆది శేషగిరిరావు గారితో.. వీరందరితో కుటుంబంలో కుటుంబంలా కలిసిపోయాం. నేను అమెరికా నుంచి వచ్చేలోగా మహేశ్‌ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారని తెలిసింది. ఏకాదశి నాడు వారిని కలిశాను. అప్పుడు కృష్ణగారిని చూస్తే గుండె తరుక్కుపోయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో మహేశ్‌బాబును అంత డల్‌గా ఎప్పుడూ చూడలేదు. ఇందిరమ్మ అంటే మా దృష్టిలో మహాలక్ష్మి, దేవత.

ఆమె ఎక్కువ మాట్లాడరు, కేవలం చిన్న చిరునవ్వుతో పలకరిస్తుంటారు. ఆమె మరణించాక కృష్ణగారి ముఖం చూసి ఎంతో ఆవేదన చెందాను. సామాన్యంగా అలాంటి సందర్భాల్లో మనం తల్లడిల్లిపోతాం. కానీ సాహసమే ఆయన ఊపిరి అన్నట్లుగా గుండెనిబ్బరం చేసుకుని కూర్చున్నారు. మహేశ్‌బాబును చిరునవ్వు లేకుండా అలా దిగులుగా చూడటం ఇదే మొదటిసారి. అలాంటి రోజు వస్తుందనుకోలేదు. ఆయనకు కోపం వచ్చినప్పుడు కూడా పెదాలపై చిరునవ్వు ఉండేది. అలాంటిది ఆ తల్లి జ్ఞాపకాల్లో మహేశ్‌ పెదాలపై చిరునవ్వు మాయమైంది. మహేశ్‌బాబు కాశీకి కూడా వెళ్లి వచ్చాడు. తల్లిని గుర్తు చేసుకుంటూ తండ్రిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.

చదవండి: కొత్త కారు ఇంటికి తెచ్చిన సింగర్‌
ప్రముఖ బుల్లితెర నటికి క్యాన్సర్‌?

మరిన్ని వార్తలు