Paruchuri Gopala Krishna: అలా ఇంద్ర సినిమాలో నటించే ఛాన్స్‌ మిస్సయింది!

28 Jul, 2022 16:11 IST|Sakshi

ఇంద్ర సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా పూర్తై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు పరుచూరి గోపాలకృష్ణ. 'ఇంద్ర సినిమా చేయుండకపోతే ఆ వైభవాన్ని మేము అనుభవించేవాళ్లం కాదు. చిరంజీవి అభిమానులే కాదు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఇంద్ర. ఇందుకు చిన్నికృష్ణ కథ, పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్స్‌, బి.గోపాల్‌ దర్శకత్వం, చిరంజీవి నటనే కారణం.అంత గొప్ప సినిమా కథను మొదట బి.గోపాల్‌ వద్దన్నారు.

కారణమేంటంటే.. ఆయన తెరకెక్కించిన గత రెండు చిత్రాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడులోని హీరోల పాత్ర చిత్రీకరణ కాస్త ఈ సినిమాలో ఉన్నట్లే ఉంది. కాబట్టి మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ఏమవుతుందోనని భయపడ్డాడే తప్ప కథ బాలేదని మాత్రం అనలేదు. అలా బి.గోపాల్‌, అశ్వనీదత్‌ సినిమా చేయడానికి సముఖత వ్యక్తం చేయలేదు. చిరంజీవిగారు ఓ అద్భుతమైన సినిమా మిస్‌ అయిపోతున్నారు.. ఎలా అని బాధపడ్డా. విషయం చిరంజీవికి చెప్పాను. వాళ్లిద్దరూ లేకుండానే రేపు చిన్నికృష్ణతో వచ్చి నాకు కథ చెప్పండి అన్నారు. కథ చెప్పాం.. ఇంటర్వెల్‌ అవగానే లేచి కిళ్లీ వేసుకుని సెకండాఫ్‌ వినక్కర్లేదు.. హిట్‌ అవుతుందన్నారు.

కథ పూర్తయ్యే సరికి పక్క గదిలో నుంచి అశ్వనీదత్‌, బి.గోపాల్‌ వచ్చి కూర్చున్నారు. అందరం కలిసి చేద్దామన్నారు. ఇంద్రలో తనికెళ్ళ భరణి పోషించిన పాత్ర మొదట నాకే వచ్చింది. కానీ మోకాలి నొప్పితో అంతదూరం ప్రయాణం చేయలేక నేను వదిలేసుకున్నా. అలాగే డైలాగ్స్‌ రైటర్‌ అయిన నేను మూగపాత్రలో నటిస్తే జనాలు ఆదరిస్తారా? అనుకున్నా. అందుకే మూగపాత్ర ఎందుకులే అని చేయనని చెప్పా! అలా మంచి సినిమాలో అవకాశం చేజారింది. కానీ మేము రాసిన 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' అనే డైలాగ్‌ ఇప్పటికీ మారుమోగిపోతూనే ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.

చదవండి: షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్‌, వీడియో వైరల్‌
నాకు లైన్‌ వేయడం ఆపు అనన్య.. విజయ్‌ రిక్వెస్ట్‌

మరిన్ని వార్తలు