Parvathy Nair: ప్చ్‌, ‘అర్జున్‌ రెడ్డి’ని మిస్‌ చేసుకున్నా..

26 Jul, 2021 19:18 IST|Sakshi

Parvathy Nair Missed Arjun Reddy Movie: అన్ని కథలు అందరికీ నచ్చవు. అందుకే తారలు కొన్ని ప్రాజెక్టులకు ఓకే చెప్తారు, మరికొన్నింటిని సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే తిరస్కరించిన సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా రికార్డు సృష్టించినప్పుడు మాత్రం అనవసరంగా మంచి అవకాశం చేజార్చుకున్నామే అని నాలుక్కరుచుకుంటారు. ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది హీరోయిన్‌ పార్వతీ నాయర్‌. టాలీవుడ్‌లో సంచలన విజయం నమోదు చేసుకున్న అర్జున్‌రెడ్డిని చేజేతులా వదిలేసుకుంది. తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని కాలితో తన్నేసుకున్నట్లైందని ఇప్పటికీ బాధపడుతోంది.

సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమెను ఓ అభిమాని 'అర్జున్‌ రెడ్డిలో రొమాంటిక్‌ సీన్లు ఎక్కువగా ఉన్నాయనే మీరు ఆ సినిమాకు నో చెప్పారా? ఆ మూవీని వదులుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నారా?' అని ప్రశ్నించాడు. దీనికి పార్వతీనాయర్‌ బదులిస్తూ.. 'అవును, నిజమే. కానీ అర్జున్‌రెడ్డి ఓ మంచి చిత్రం. ఆ సినిమాను వదులుకోకుండా ఉంటే బాగుండేది. అలాంటి మంచి సినిమా అవకాశాలు ఇంకా వస్తాయని ఆశిస్తున్నాను' అని పేర్కొంది.

2017లో వచ్చిన అర్జున్‌ రెడ్డి సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నప్పటికీ మంచి వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హీరోహీరోయిన్లు విజయ్‌ దేవరకొండ, షాలిని పాండేకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో రౌడీ హీరో క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇది హిందీలో కబీర్‌ సింగ్‌, తమిళంలో ఆదిత్మ వర్మ పేరుతో రీమేక్‌ అవగా అక్కడ కూడా హిట్‌ కొట్టింది.

మరిన్ని వార్తలు