దేవదాసులో భగవాన్‌ పాత్ర ఇష్టం...

28 Feb, 2021 10:57 IST|Sakshi
అక్కినేని నాగేశ్వర్‌ రావు పక్కన పేకేటి శివరామ్‌

‘మనసు అద్దం లాంటిది, మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది’ దేవదాసు సినిమాలో భగవాన్‌ (పేకేటి) మాటలు.. జవహర్‌లాల్‌ నెహ్రూకి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు.. ఎన్‌టిఆర్‌ రాజకీయ రంగప్రవేశం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే అంటూ ఇందిరాగాంధీకి సూచించారు.... దర్శకనిర్మాతగా చేయి కాల్చుకున్నారు.. డిటెక్టివ్‌ కథలు రాశారు.. డాక్యుమెంటరీలు తీశారు.. జాతకాలు, సంఖ్యా శాస్త్రాలను విశ్వసించారు.. ఎనిమిది సంఖ్య తనకు పడదంటూ, 2006లో కన్నుమూశారు. పేకేటి శివరామ్‌ గురించి వారి పెద్ద కుమారుడు కృష్ణమోహన్‌ సాక్షికి వివరించారు.

మనిషి అంటే మనీ ప్లస్‌ షి అనేవారు నాన్న. అన్నట్లుగానే అమ్మని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నాన్న పూర్తి పేరు పేకేటి శివరామ్‌. ప. గో. జిల్లా పేకేరులో 1918, అక్టోబరు 8న పుట్టారు. తాతగారు చిన్నప్పుడే పోవటంతో నాన్నగారు కష్టపడి ప్రైవేటుగా భీమవరంలో బిఏ చదువుకున్నారు. అమ్మ పేకేటి ప్రభావతి. మేం నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలం. నేనే పెద్ద అబ్బాయిని. నా పేరు పేకేటి కృష్ణమోహన్‌. తమ్ముడు పేకేటి రంగా సినిమాలలో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మిగతా తమ్ముళ్లు రంగారావు, వెంకటేశ్వరరావు, గోపాల్‌. అమ్మాయిలు రాజ్యలక్ష్మి, శాంతి, వరలక్ష్మి, పూర్ణిమ. అందరూ బిఏ చదివారు. నేను మాత్రం మెట్రిక్‌ వరకే చదివాను. నాన్నగారి పెంపకం వల్ల ఇప్పటికీ కుటుంబసభ్యులమంతా ఏడాదికోసారి తప్పనిసరిగా కలుస్తున్నాం. 

మంచి ఆరోగ్యం ఇచ్చారు...
నా 18 వ ఏట, నాన్నగారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని, ‘నేను నీకు స్నేహితుడిని, ఏ ఇబ్బందులు వచ్చినా నాతో నిర్మొహమాటంగా చెప్పు. నీ పైవాడిని చూసి అసూయపడకు, నీ కింద వాడిని చూసి సంతోషపడు’’ అని చెప్పేవారు. ఆయన చెప్పినదల్లా పాటిస్తున్నాం. నాన్న మాకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, అందరికీ మంచి ఆరోగ్యం, మంచి పేరు, సంఘంలో గౌరవం ఇచ్చారు.

కష్టాలు ఎదుర్కోవాలన్నారు...
నౌకల గురించి ‘జల ఉష’, ‘జల ప్రభ’ అని రెండు డాక్యుమెంటరీలు తీశారు. ‘రైజింగ్‌ సన్‌’ అని సంజయ్‌ గాంధీ మీద డాక్యుమెంటరీ రూపొందించాలని నిశ్చయించుకున్నాక, ఆర్థిక ఇబ్బందులు వచ్చి, వడ్డే రమేశ్‌గారిని అడిగారు. ఆయన నాలుగు రోజులయ్యాక రమ్మన్నారు. నాలుగు రోజుల తరవాత నాన్న నన్ను పంపితే, నేను వెళ్లాను. అప్పుడు ఆయన ‘మా అకౌంటెంట్‌ బ్యాంక్‌కి వెళ్లాడు, కాసేపు ఆగు’ అన్నారు. సరిగ్గా అప్పుడే వార్తాపత్రికలలో సంజయ్‌గాంధీ మరణించాడనే వార్త కనిపించింది. నేను నిరాశ చెందాను. అప్పుడు నాన్న నాతో, ‘ఎప్పుడూ అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. సుఖాలే ఎల్లకాలం ఉండవు’ అంటూ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండేవారు కాదు. కాంగ్రెస్‌ పార్టీ, షూటింగులలో తలమునకలై ఉండేవారు.  ఇంట్లో ఉండకపోయినా పిల్లలకు ఏ లోటూ రానివ్వలేదు. 

కరివేపాకులా వాడుకున్నారు..
ఒకరోజు స్కూల్‌ నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాను. అప్పట్లో నాన్న సినిమాల్లో నటిస్తున్నారు. ఆయనకు కారులో క్యారేజీ పంపేవారు. ఆ రోజు క్యారేజీతో పాటు నేను కూడా షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లాను. ఆ సమయంలో పుల్లయ్యగారు వెంకటేశ్వర మహాత్మ్యం సినిమా తీస్తున్నారు. నేను షూటింగ్‌ చూడటానికి వచ్చానని తిట్టి, నాన్న నన్ను అదే కారులో ఇంటికి పంపేశారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు బాగా గుర్తు. మరోసారి నాన్నను, ‘నువ్వు సినిమాలు ఎందుకు తీయట్లేదు’ అని అడిగాను. అందుకు ఆయన , ‘నువ్వు రోజుకి మూడుసార్లు భోజనం చేస్తున్నావు, నీకు ఇలా తినటం ఇష్టం లేదా’ అన్నారు. ఆ రోజు నుంచి నాన్నను ఎన్నడూ అడగలేదు. ప్రతిఫలం ఆశించకుండా ఎంతోమందికి సహాయం చేశారు. ఆయనను అందరూ అభిమానించేవారు. సినీ పరిశ్రమలో ఆయనను చాలామంది కరివేపాకులా వాడుకున్నారు. ఎంతో సంపాదించుకున్నా ఏమీ మిగుల్చుకోలేకపోయారు. 

చాలా భయం..
నాన్నగారంటే ఎంత భయమో అంత గౌరవం. ఆయన సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఇంటి విషయాలు అమ్మే చూసుకునేది. అద్దె ఇంట్లో ఉంటున్న రోజుల్లో నాన్నకు జీతం రాగానే.. ఇంటి అద్దె, పనిమనిషి జీతం, సరుకుల కోసం.. అంటూ డబ్బుల్ని విడివిడిగా ప్యాక్‌ చేసేది. అమ్మ చదువుకోక పోయినా, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ, నాన్నకు సహాయంగా ఉండేది. ఆయనకు ఇష్టమైన వంటలు చేసేది. తల్లి నవ మాసాలు మోసి పెంచుతుంది. ఆ ప్రేమ నీళ్లలాంటిది. కంటికి కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనపడదు. నాన్న ప్రేమ కూడా అంతే, బయటకు కనిపించేలా ఉండేది కాదు. 

తెలియని విద్య లేదు..
నాన్నగారు కాంగ్రెస్‌ పార్టీ. జవహర్‌లాల్‌ నెహ్రూకి పర్సనల్‌ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తరవాత ఇందిరాగాంధీ సమయంలో, నాన్నను దక్షిణభారతదేశానికి పబ్లిసిటీ ఇన్‌చార్జిగా నియమించారు. ఎన్‌టిఆర్‌ పార్టీ పెట్టినప్పుడు, ఇందిరాగాంధీ నాన్నకు ఫోన్‌ చేసి, ఎన్‌టిఆర్‌ గురించి అడిగితే, 72 పేజీలు రిపోర్టు రాసి పంపారు. అది ఆవిడ చదివి, వాస్తవాలు తెలుసుకోవటం కోసం మూపనార్‌ను అడిగితే, ఆయన ప్రాబ్లమ్‌ లేదన్నారు. ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో ఎన్‌టిఆర్‌ ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ఇందిరాగాంధీ నాన్నను ఢిల్లీ పిలిపించి, ‘నీ మాట వినకుండా నేను తప్పు చేశాను’ అంటూ తన తప్పు ఒప్పుకున్నారని, నాన్న స్వయంగా చెప్పారు. 

కాంగ్రెస్‌లోనే..
డిటెక్టివ్‌ కథలు రాశారు. పోలీస్‌ వాళ్లకి డాక్యుమెంటరీలు తీసి ఇచ్చారు. ఆలిండియా ఎన్‌టిఆర్‌ ఫ్యాన్స్‌ ఆసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. నాన్నకి ఎన్‌టిఆర్‌తో ఎంతో స్నేహం వున్నా, ఆయన పార్టీలోకి ఆహ్వానించినా, కాంగ్రెస్‌ను విడిచిపెట్టలేదు. మా ఇంటికి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వస్తుండేవారు. జగ్గయ్య, హీరో కృష్ణ గారి తల్లి, రాజసులోచన, షావుకారు జానకి మా ఇంట్లో ఏం జరిగినా వస్తుండేవారు. 

బంగారు పూలతో...
అమ్మనాన్నలు మునిమనవలను చూశారు. ముని మనవడితో మా అమ్మనాన్నలకు బంగారుపూలతో అభిషేకం చేయించాం. ఒకసారి నాన్నతో ‘ఏ రోజు కాల్‌ షీట్‌ ఇస్తే, ఆ రోజు లక్ష ఒత్తుల నోము చేసుకుంటాను’ అంది అమ్మ. ఆయన నవ్వుతూ ‘అలాగే చిట్టీ’ అన్నారు. అమ్మను ‘చిట్టీ’ అనేవారు. అలా అమ్మ లక్ష ఒత్తుల నోము, పసుపు కొమ్ముల నోము చేసుకుంది. 

మంచి మిత్రులు..
ఒక రోజు రాత్రి నాన్న అనారోగ్యంతో బాధపడుతుంటే, జగ్గయ్య గారికి ఫోన్‌ చేసి, ‘మావయ్యా! నాన్నకు ఒంట్లో బాలేదు, హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలి’ అని చెప్పగానే ఆయన వచ్చి, నాన్నను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అంతటి స్నేహం ఉండేది. నాన్నతో 65 ఏళ్లు, అమ్మతో 73 ఏళ్లు ఉండే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నా వయస్సు 77 సంవత్సరాలు. 

మూడు తరాల ప్రేమ వివాహాలు..
నాన్నగారు నటించిన సినిమాలలో దేవదాసు, వద్దంటే డబ్బు, చిరంజీవులు.. చాలా ఇష్టం. నాన్నది, నాది, మా పెద్దబ్బాయిది ప్రేమ వివాహాలు. ఆయన రోజూ ‘మెయిల్‌’ పేపర్‌ చదివేవారు.  జాతకాల మీద నమ్మకం ఎక్కువ. సినిమా వాళ్లకి కూడా జాతకాలు చెప్పేవారు. న్యూమరాలజీని బట్టి, పేర్లు మార్చేవారు. ‘ఇది 2006, ఈ సంఖ్య నాకు పడదు. మీ నాన్న జీవితం అయిపోయింది’ అని డెత్‌ని ప్రిడిక్ట్‌ చేశారు. పదిహేను రోజులపాటు అనారోగ్యంతో బాధపడి, డిసెంబరు 30, 2006 వైకుంఠ ఏకాదశి నాటి రాత్రి కాలం చేశారు. ఆ రోజు అక్కినేని ఫోన్‌ చేసి, ‘బాబూ! నేను డెడ్‌ బాడీని చూడలేను, తరవాత వస్తాను. మీ ఆంటీ మాత్రం.. మంచి రోజు సెలవు తీసుకున్నారని చెప్పమంది. నాకు దేవుడి మీద నమ్మకాలు లేవు. ఆవిడ చెప్పమన్నది చెప్తున్నాను’ అన్నారు.  

నాన్న నటించిన చిత్రాలు
దేవదాసు, వద్దంటే డబ్బు, గులేబకావళి కథ, వెలుగు నీడలు, బభ్రువాహన, సువర్ణసుందరి, భాగ్యరేఖ, చిరంజీవులు, పెళ్లినాటి ప్రమాణాలు, జయభేరి, వీర కంకణం, పాండురంగ మహాత్మ్యం, అనార్కలి, కన్యా శుల్కం, కుల గౌరవం, అల్లూరి సీతారామరాజు వంటి ఎన్నో చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేవదాసులోని భగవాన్, అల్లూరి సీతారామరాజులో డిప్యూటీ కలెక్టర్‌ పాత్రలు బాగా గుర్తింపు తెచ్చాయి.
సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు